Iran Protest: ఇరాన్ ఆందోళనల్లో 5వేల మంది మృతి
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:52 AM
ఇరాన్లో ఆందోళనలు, ప్రభుత్వ పాశవిక అణచివేతలో కనీసం 5వేల మంది మరణించారని, వారిలో 500 మంది వరకు భద్రతా సిబ్బంది ఉన్నారని ఆదివారం అధికారవర్గాలు తెలిపాయి.
టెహ్రాన్, జనవరి 18: ఇరాన్లో ఆందోళనలు, ప్రభుత్వ పాశవిక అణచివేతలో కనీసం 5వేల మంది మరణించారని, వారిలో 500 మంది వరకు భద్రతా సిబ్బంది ఉన్నారని ఆదివారం అధికారవర్గాలు తెలిపాయి. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. మరోవైపు, ఆందోళనలో పాల్గొన్న కొందరికి సామూహిక మరణశిక్షలు అమలు చేస్తామని ఆదివారం ఇరాన్ న్యాయ వ్యవస్థ తెలిపింది. వాస్తవానికి సామూహిక ఉరిశిక్షలు నిలిపివేసినందునే ఇరాన్పై దాడిని వాయిదా వేసినట్లు ట్రంప్ శనివారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో, సామూహిక ఉరిశిక్షలు విధిస్తామన్న ఇరాన్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకొంది. ఇదిలా ఉండగా, ఇరాన్లో ఆందోళనకారుల ఆగ్రహం అమెరికా అధ్యక్షుడు ట్రంప్వైపు మళ్లింది. ట్రంప్ ప్రారంభంలో ఆందోళనలను ప్రోత్సహించి, ఇప్పుడు తమను మోసగించారని వారు మండిపడుతున్నారు. విదేశీ హామీలను నమ్మినందుకు మూల్యం చెల్లించాల్సి వచ్చిందని వాపోతున్నారు.