హెచ్1బీలపై అమెరికా నిఘా నేత్రం!
ABN , Publish Date - Aug 25 , 2026 | 05:13 AM
హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియలో చోటు చేసుకుంటున్న అక్రమాలను అరికట్టేందుకు అమెరికా సర్కారు నిఘాను ముమ్మరం చేసింది. కేవలం దరఖాస్తులను పరిశీలించడమే కాకుండా ఆ వీసాలను స్పాన్సర్ చేసిన సంస్థల పుట్టుపూర్వోత్తరాలను ఆరా తీస్తూ లోతైన దర్యాప్తు జరుపుతోంది.
వీసా స్పాన్సర్షిప్ సంస్థలే టార్గెట్గా టాస్క్ఫోర్స్ సోదాలు
(డాలస్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి కృష్ణమోహన్ దాసరి)
హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియలో చోటు చేసుకుంటున్న అక్రమాలను అరికట్టేందుకు అమెరికా సర్కారు నిఘాను ముమ్మరం చేసింది. కేవలం దరఖాస్తులను పరిశీలించడమే కాకుండా ఆ వీసాలను స్పాన్సర్ చేసిన సంస్థల పుట్టుపూర్వోత్తరాలను ఆరా తీస్తూ లోతైన దర్యాప్తు జరుపుతోంది. ప్రస్తుతానికి హెచ్1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న యువతకు ఏ ఇబ్బంది కనిపించడం లేదు. అయితే వారి స్పాన్సర్షిప్ వెనుక ఏమైనా లోపాయికారి లావాదేవీలు జరిగాయేమోననే దిశగా మాత్రమే దృష్టి సారిస్తున్నారు. కొన్ని నెలల కింద ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యవేక్షణలో ఏర్పాటైన టాస్క్ఫోర్స్ నేతృత్వంలో కార్మికశాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దర్యాప్తు ప్రారంభమైంది. హోంల్యాండ్ సెక్యూరిటీ, న్యాయ శాఖలు కూడా దర్యాప్తులో భాగస్వామ్యవుతున్నాయి. తాజాగా ఈ బృందాలు డాల్సలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. హెచ్1బీ వీసాలు మంజూరైన 500 మందికి సంబంధమున్న సంస్థల చిరునామాలు ఒకే బహుళ అంతస్తుల భవనంలో ఉన్నట్లుగా తేలడంతో.. అందులోని ప్రతి కార్యాలయాన్ని తనిఖీ చేశాయి. చాలా కార్యాలయాలు మూసి ఉండటాన్ని గుర్తించాయి. ఇటు స్థానిక ప్రభుత్వాలు కూడా ఈ దిశగా దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టెక్సా్సకు సంబంధించిన అటార్నీ జనరల్ కార్యాలయం ఉత్తర టెక్సాస్లోని 3 సంస్థలకు నోటీసులు పంపింది.
దర్యాప్తులతో అక్రమాలకు చెక్..
ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు స్థిరపడటానికి వస్తున్న యువతకు అక్రమ పద్ధతుల్లో హెచ్1బీ వీసాలు పొందడానికి సహకరించే తప్పుడు సంస్థలు కూడా ఇక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. వీసాలకు సంస్థల స్పాన్సర్షిప్ తప్పనిసరి కావడాన్ని.. ఈ దళారీ సంస్థలు స్వార్థానికి వాడుకుంటున్నాయి. ఒకవైపు స్పాన్సర్ చేస్తూ మరోవైపు వారు పొందే ఉద్యోగాల నుంచి లభించే వేతనాల్లో భారీ వాటాలను తమకు చెల్లించేలా అనధికార ఒప్పందాలు చేసుకుంటున్నాయి. కేవలం భారతీయ సంస్థలే కాకుండా పలు దేశాల సంస్థలు అమెరికాలోని అనేక దేశాలకు చెందిన యువతతో ఇలాంటి లావాదేవీలు సుదీర్ఘకాలంగా నడుపుతున్నాయి. భారతీయులకు చెందిన, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సంస్థలు ఐటీ సంస్థలు, కన్సల్టెన్సీలు ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయి. ఈ దర్యాప్తుల వల్ల ఇలాంటి అక్రమాలు తగ్గే అవకాశముంది.
విద్వేషం ఓ కారణమా..?
అమెరికాలో కొన్నాళ్లుగా ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడుతున్న వారి మీద విద్వేష ప్రచారం విస్తృతంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు ఇండిపెండెంట్ జర్నలిస్టులు విద్వేష ప్రచారాల్ని వ్యాప్తి చేయడంలో కీలకంగా ఉంటున్నారు. వీరి సోషల్ మీడియా పోస్టులు, టీవీ చానెళ్లతో అనుసంధానమై ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వ నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. తాము నిష్ర్కియాపరంగా ఉన్నట్లు ప్రజలు భావించకుండా మీడియా ఒత్తిడికి తలొగ్గి సర్కారు కూడా వీసా అక్రమాలపై నిఘా నేత్రం తెరచినట్టుగా స్పష్టమవుతోంది.