165 మంది బాలికల మృతదేహాలకు సామూహిక ఖననం!
ABN , Publish Date - Mar 04 , 2026 | 04:00 AM
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంలో సామాన్యులు సమిధలుగా మారుతున్నారు. పదుల సంఖ్యలో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు...
సమాధుల ఫొటోను పోస్టు చేసిన ఇరాన్ విదేశాంగ మంత్రి
టెహ్రాన్, మార్చి 3: ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంలో సామాన్యులు సమిధలుగా మారుతున్నారు. పదుల సంఖ్యలో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని మినాబ్ నగరంపై జరిగిన క్షిపణి దాడిలో ఓ పాఠశాలకు చెందిన దాదాపు 165 మంది విద్యార్థినులు మరణించిన విషయం తెలిసిందే. వారందరినీ ఖననం చేసేందుకు సామూహిక సమాధులు తవ్వుతున్న దృశ్యాలు వైరల్గా మారాయి. ఈ ఫొటోను ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. ఒక బహిరంగ ప్రదేశంలో నాలుగైదు వరుసల్లో యంత్రాల సాయంతో ఈ సమాధులను తవ్వడం అందులో కనిపిస్తుంది. కొంత మంది అక్కడ మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉంది. బాంబు దాడుల్లో విద్యార్థినుల శరీరాలు ముక్కలు ముక్కలుగా అయ్యాయని అబ్బాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘గాజా నుంచి మినాబ్ వరకు.. అమాయకులను క్రూరంగా హత్య చేశారు’ అని ఆయన తన పోస్టులో రాశారు.