మూగజీవులపై ఆసక్తి ఉంటే సరైన ఎంపిక వెటర్నరీ సైన్స్
ABN , Publish Date - May 04 , 2026 | 01:38 AM
మెడిసిన్ అలాగే తత్సంబంధ కోర్సుల తరవాత అత్యంత ప్రాధాన్యం కలిగినది బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండ్రీ(బీవీఎస్సీ అండ్ ఏహెచ్)....
దిక్సూచి
మెడిసిన్ అలాగే తత్సంబంధ కోర్సుల తరవాత అత్యంత ప్రాధాన్యం కలిగినది బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండ్రీ(బీవీఎస్సీ అండ్ ఏహెచ్).
ఈ కోర్సు కాలవ్యవధి ఐదున్నర సంవత్సరాలు. నాలుగున్నర సంవత్సరాలు వెటర్నరీ కళాశాలలో చదువుతోపాటు ఏడాది కాలం ప్రాక్టికల్స్ ఉంటాయి. కోర్సులో భాగంగా అనాటమి, వెటర్నరీ ఫిజియాలజీ, బయో కెమిస్ర్టీ, యానిమల్ న్యూట్రిషన్, లైవ్స్టాక్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, వెటర్నరీ పబ్లిక్ హెల్త్, వెటర్నరీ పారాసైటాలజీ, వెటర్నరీ మైక్రో బయాలజీ, వెటర్నరీ ఫార్మకాలాజీ అండ్ టాక్సికాలజీ, లైవ్ స్టాక్ ప్రొడక్షన్ టెక్నాలజీ, వెటర్నరీ మెడిసిన్, వెటర్నరీ గైనకాలజీ, వెటర్నరీ సర్జరీ, వెటర్నరీ యానిమల్ హస్బెండ్రీ, ఎక్స్టెన్సన్, వెటర్నరీ క్లినికల్ ప్రాక్టీసు తదితర సబ్జెక్టులను చదవాలి. చివరి సంవత్సరం ఇంటర్న్షిప్ వెటర్నరీ హాస్పిటల్స్, ఫార్మా కంపెనీలు, డైరీ ఫారమ్లలో చేయాలి.
బీవీఎస్సీ కోర్సు పూర్తి చేసినవారికి పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్(వీఏఎ్స)గా ఉద్యోగాలు వస్తాయి. అవేకాకుండా ప్రైవేట్ రంగంలో - ఫీడ్, ఫార్మా, పౌల్ర్టీ ఇండస్ర్టీలలో, ప్రైవేట్ ఫ్యాక్టరీలలో ఉద్యోగావకాశాలు ఉంటాయి. పోటీ పరీక్షలు అన్నీ రాయవచ్చు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్)లో కూడా ఉద్యోగాలుంటాయి. ఆర్మీలో రిమౌంట్ వెటర్నరీ కోర్, ఇండో టిబెటిన్ బోర్డర్ ఫోర్స్లో ఉద్యోగాలు లభిస్తాయి.
బీవీఎస్సీ పూర్తయిన తరవాత రెండు సంవత్సరాల ఎంవీఎస్సీ చదవవచ్చు. ఎంవీఎస్సీ పూర్తయిన తరవాత నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) పూర్తి చేసిన వారికి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ఉద్యోగాలు వస్తాయి. తదుపరి పీహెచ్డీ కోర్సులు చేయవచ్చు. ప్రమోషన్స్ కూడా అందుకోవచ్చు.

తెలంగాణ
జూ రాజేంద్రనగర్(హైదరాబాద్), కోరుట్ల, మామునూరులలో వెటర్నరీ కళాశాలలున్నాయి. రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాలలో 86 సీట్లు ఉన్నాయి. వాటిలో 15 సీట్లను నీట్ ర్యాంకు ఆధారంగా వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) భర్తీ చే స్తుంది. దానికి నీట్ లో ర్యాంకు వచ్చిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా 71 సీట్లను తెలంగాణ ఈఏపీసెట్ ర్యాంకు ద్వారా భర్తీ చేసారు. కోరుట్లలో 85 సీట్లకుగాను 15 వీసీఐ భర్తీ చేస్తుంది. మామునూరు లో 44 సీట్లునూ ఈఏపీసెట్ ర్యాంకుతోనే నింపుతారు.
ఎన్ఆర్ఐ/ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా కింద చదువాలనుకునే విద్యార్థులకు మూడు కళాశాలలో 9 సీట్లు కేటాయిస్తారు. ఈ సీటు పొందిన విద్యార్థులు ఏటా రూ.10లక్షల చొప్పున ఫీజు చెల్లించాలి.
సెల్ఫ్ పైనాన్స్ కింద ఆరు సీట్లు మాత్రమే ఉంటాయి. వీటిని పొందిన వారు కూడా కోర్సు పూర్తి చేయడానికి రూ.50 లక్షలను ఫీజుగా చెల్లించాలి.
గతంలో వెటర్నరీ కోర్సును సెమిస్టర్ విధానం ప్రకారం చదివేవారు. ఇకపై దేనికదిగా అంటే మొదటి సంవత్సరం పాసైన విద్యార్థులు మాత్రమే రెండో ఏడాది కోర్సులోకి వెళ్ళేందుకు అర్హులు.
డాక్టర్ పి జయలక్ష్మి,
కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్,
పీవీ నర్సింహ్మరావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం

ఆంధ్రప్రదేశ్
మా వర్సిటీకీ అనుబంధంగా తిరుపతి, ప్రొద్టుటూరు, గన్నవరం, గరివిడిలో ఒకొక్కటి చొప్పున నాలుగు వెటర్నరీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఏపీ ఈఏపీసెట్ ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన ఈ కోర్సులోకి ప్రవేశాలు నిర్వహిస్తారు. ఈఏపీసెట్ ద్వారా 85శాతం(25శాతం ఫార్మర్స్ కోటా), వీసీఐ కోటా కింద(నీట్ ర్యాంకు ఆధారంగా)15శాతం సీట్లను భర్తీ చేస్తున్నారు. కాగా ఈఏపీసెట్ ర్యాంకు ఆధారంగా ఒక్కో కళాశాలలో 70 సీట్ల చొప్పున నాలుగు కళాశాలలో 280సీట్లు, వీసీఐ కోటాలో ఒక్కో కళాశాలలో(తిరుపతి, ప్రొద్దుటూరు, గన్నవరం) 15సీట్ల చొప్పున 45సీట్లు కలిపి మొత్తం 325సీట్లు ఉన్నాయి. గరివిడి వెటర్నరీ కళాశాలకు వీసీఐ గుర్తింపు లేని కారణంగా ఈ కోటాలో ప్రవేశాలకు అనుమతి లేదు. ఈడబ్ల్యూఎస్ కింద 10శాతం సీట్లను భర్తీ చేస్తున్నారు.
తిరుపతి, ప్రొద్దుటూరు, గన్నవరం కళాశాలలో పీజీ(ఎంవీఎస్సీ) కోర్సులు నిర్వహిస్తున్నారు. 16బ్రాంచ్లలో(ప్రీ క్లినికల్, పారా క్లినికల్, క్లినికల్) ఏడాదికి దాదాపుగా 40-60మంది వరకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. పీహెచ్డీని తిరుపతి, ప్రొద్దుటూరు కళాశాలలో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. మెడికల్, వెటర్నరీ, పర్యావరణ రంగాలు గతంలో వేర్వేరుగా పనిచేస్తుండేవి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వన్ హెల్త్ కాన్సెప్ట్ విధానంలో భాగంగా ఈ మూడు రంగాలు ఉమ్మడిగా పనిచేసే విధంగా చర్యలు చేపట్టారు. మనుషులు, జంతువులకు పలు రకాలవ్యాధులు (మలేరియా, డెంగీ, కుక్కకాటు, లెప్టోపైరోసిస్, బ్రూసెల్లోసిస్ వంటివి)కామన్గా వస్తాయి. దీనిపై పర్యావరణ ప్రభావమూ ఉంటుంది. వెటర్నరీ, హ్యూమన్ వైద్యులు, పర్యావరణవేత్తలు అందరూ కలసి పనిచేసినప్పుడే సరైన పరిష్కారం లభిస్తుందన్నదే ఈ వన్ హెల్త్ కాన్సెప్ట్ విధానం.
డాక్టర్ ఆర్వీ సురే్షకుమార్,
వెటర్నరీ సైన్స్ డీన్, ఎస్వీవీయూ, తిరుపతి
అప్పారెడ్డిగూడెం భీమయ్య, రాజేంద్రనగర్, హైదరాబాద్;
చంద్రశేఖర్రెడ్డి, తిరుపతి
ఈ వార్తలు కూడా చదవండి
బాలుడి చేతిలో పేలిన బ్యాటరీ.. తెగిపడిన వేళ్లు..
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి