రేపు ఏపీ ఈసెట్-2026
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:19 AM
ఏపీ ఈసెట్-2026కు ఉన్నత విద్యాశాఖ మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. ఏపీ, తెలంగాణలో ఈ నెల 23వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు.
ఏపీ, తెలంగాణలో 95 పరీక్ష కేంద్రాలు
అనంతపురం ఉన్నత విద్య, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): ఏపీ ఈసెట్-2026కు ఉన్నత విద్యాశాఖ మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. ఏపీ, తెలంగాణలో ఈ నెల 23వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. అనంతపురం జేఎన్టీయూలో ఏపీ ఈసెట్ చైర్మన్ ప్రొఫెసర్ సుదర్శన్రావ్, కన్వీనర్ దుర్గాప్రసాద్ మంగళవారం ఈ వివరాలను వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏపీ ఈసెట్ కోసం 95 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్లో ఒక పరీక్ష కేంద్రం, ఆంధ్రప్రదేశ్లోని 47 పట్టణాల్లో 94 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఆన్లైన్ ద్వారా 33,751 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తామని.. గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మరో సెషన్ నిర్వహిస్తామని వివరించారు. ఈ పరీక్ష మొత్తం ఆన్లైన్ పద్ధతిలో జరుగుతుందని వెల్లడించారు. ఉదయం సెషన్ వారికి 7.30 గంటల నుంచి, మధ్యాహ్నం సెషన్ వారికి 12.30 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని, ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని తెలిపారు. హాల్ టికెట్, అప్లికేషన్ ఫాం, బాల్ పాయింట్ పెన్, ఐడీ కార్డు మినహా ఇతర వస్తువులు, ఎలక్ర్టానిక్స్ వస్తువులు అనుమతించబోమని స్పష్టంచేశారు.