కుక్కలే కాదు... గోవధపైనా స్పందించాలి!
ABN , Publish Date - Jun 09 , 2026 | 12:44 AM
జంతు ప్రేమ, పర్యావరణ పరిరక్షణ నేటి సమాజంలో విస్తృతంగా చర్చకు వస్తున్న అంశాలు. అనేక స్వచ్ఛంద సంస్థలు, జంతు ప్రేమికులు మూగజీవులపై కరుణ చూపడం మానవత్వానికి నిదర్శనం. అయితే...
జంతు ప్రేమ, పర్యావరణ పరిరక్షణ నేటి సమాజంలో విస్తృతంగా చర్చకు వస్తున్న అంశాలు. అనేక స్వచ్ఛంద సంస్థలు, జంతు ప్రేమికులు మూగజీవులపై కరుణ చూపడం మానవత్వానికి నిదర్శనం. అయితే భారతీయ సంస్కృతికి ప్రతీకగా భావించే గోమాత వధ, అక్రమ రవాణా, నిర్లక్ష్యం వంటి అంశాలపై సమాజం మౌనం పాటించడం ఆందోళన కలిగించే విషయం.
గోవు కేవలం ఒక పశువు కాదు. భారతీయ వ్యవసాయానికి మూలాధారం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. పాడి పరిశ్రమకు ప్రాణాధారం. ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఎరువులు, పర్యావరణ సమతౌల్యంలో గోసంతతి కీలక పాత్ర పోషిస్తోంది. అలాంటి గోమాత రక్షణను రాజకీయ, మత, వర్గ వివక్షల కోణంలో చూడటం సమంజసం కాదు. ఇటీవల హైదరాబాదులో హస్కీ జాతి కుక్కలు ఎండలకు తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాయనే వార్తలపై జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా పెద్ద ఎత్తున స్పందించాయి. వాటి సంరక్షణ కోసం వైద్య శిబిరాలు, ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడం మానవత్వానికి ఉదాహరణ. అదే సమయంలో గోవుల మరణాలు, అక్రమ రవాణా, హింసపై స్పందన లేకపోవడం బాధాకరం. కొంతమంది ముస్లింలు సైతం హిందువుల మనోభావాలను గౌరవిస్తూ గోహత్యలకు దూరంగా ఉంటామని ప్రకటించడం సామాజిక సామరస్యానికి మంచి సంకేతం. ఇలాంటి పరస్పర గౌరవ భావనలు సమాజంలో పెరగాలి. అదే సమయంలో సెక్యులరిజం పేరుతో గో వధపై మాట్లాడకపోవడం సరైన విధానం కాదు.
ఆవు లేనిదే వ్యవసాయం లేదు, వ్యవసాయం లేనిదే రైతు లేడు, రైతు లేనిదే భోజనం లేదు. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నిలబడదు. అందువల్ల గోరక్షణ అనేది కేవలం భావోద్వేగ అంశం కాదు.. అది దేశ భవిష్యత్తుకు సంబంధించిన బాధ్యత. మూగజీవుల సంరక్షణలో ఆవులను మినహాయించడం తగదు. ప్రతి ఒక్కరూ గో వధను ఖండిస్తూ, గోసంతతి పరిరక్షణకు ముందుకు రావాలి.
పగుడాకుల బాలస్వామి
విశ్వహిందూ పరిషత్, తెలంగాణ
ఇవి కూడా చదవండి..
ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా కూటమి నేతలు..
మోదీ పాలనలో రాజ్యాంగంపై దాడులు పెరిగాయి: ఏఐసీసీ చీఫ్ ఖర్గే..