ఆప్ నేత హత్య.. మాస్క్ పెట్టుకుని తుపాకీతో వచ్చిన షూటర్..
ABN , Publish Date - Feb 06 , 2026 | 05:12 PM
పంజాబ్లో ఆప్ నేత లక్కీ ఒబెరాయ్ హత్యకు సంబంధించి తాజాగా కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ముఖం కనబడకుండా మాస్క్ పెట్టుకుని వచ్చిన నిందితుడు అత్యంత సమీపం నుంచి ఆయనపై కాల్పులు జరిపినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నేత లక్కీ ఒబెరాయ్ శుక్రవారం పట్టపగలు దారుణ హత్యకు గురికావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. జలంధర్లోని మోడల్ టౌన్ ప్రాంతంలో ఓ గురుద్వారాకు సమీపంలో ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు దిగడంతో లక్కీ ఒబెరాయ్ కన్నుమూశారు.
ఇందుకు సంబంధించి తాజాగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ముఖం కనబడకుండా మాస్క్ పెట్టుకుని, హుడీ కప్పుకుని వచ్చిన నిందితుడు ఒబెరాయ్ వాహనం వద్దకు వచ్చి లోపల ఉన్న ఆయనపై కాల్పులు జరిపినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఒబెరాయ్కు అత్యంత సమీపం నుంచి నిందితుడు పలు రౌండ్ల కాల్పులు జరిపాడు. తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నిందితుడికి కొద్ది దూరంలో మరో వ్యక్తి అతడి కోసం ద్విచక్రవాహనంపై వేచి చూసినట్టు కూడా తెలిసింది. తన మహీంద్రా థార్ రాక్స్ కారులో కూర్చున్న సమయంలో లక్కీ ఒబెరాయ్ హత్యకు గురయ్యారు. ఈ కాల్పులకు కారు అద్దాలు పగిలిపోయాయి. పక్కనే ఉన్న మరో వాహనం అద్దాలు కూడా దెబ్బతిన్నాయి.
కాల్పుల్లో కుప్పకూలిన ఒబెరాయ్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, తీవ్రగాయాలు కావడంతో ఆయన కన్నుమూశారు. ఈ ఘటనపై పంజాబ్లో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను పరిరక్షించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించాయి. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఈ ఉదంతం తెలియజేస్తోందని అసెంబ్లీ ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గత ప్రభుత్వాల కారణంగా భారత్ 6వ స్థానం నుంచి 11కు పడిపోయింది: మోదీ
క్షమాపణ చెబుతున్నా.. ఎప్స్టీన్ ఫైల్స్పై బిల్ గేట్స్ స్పందన