కొడుకు ఎదుటే ఉరి వేసుకున్న తల్లి
ABN , Publish Date - Feb 25 , 2026 | 05:21 AM
అనంతపురం జిల్లా కేంద్రంలో ఓ మహిళ తన కుమారుడి ఎదుటే ఉరి వేసుకుంది. భర్త వేధింపులే దీనికి కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు.
భర్త కానిస్టేబుల్.. వేధింపులే కారణం
అల్లుడిని ఉరి తీయాలని మృతురాలి తండ్రి డిమాండ్
అనంతపురం క్రైం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా కేంద్రంలో ఓ మహిళ తన కుమారుడి ఎదుటే ఉరి వేసుకుంది. భర్త వేధింపులే దీనికి కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మోహన్ కృష్ణ, లలిత(30) దంపతులు నగరంలోని ఆజాద్ నగర్లో నివసిస్తున్నారు. వీరికి ధర్మయోగి(8) అనే కుమారుడు ఉన్నా డు. ఈ క్రమంలో లలిత మంగళవారం ఉదయం కుమారుడి ఎదుటే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అల్లుడి వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని లలిత తండ్రి సాయిప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు. అతనిపై సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశామని, రాత్రి మహిళా పోలీస్ స్టేషన్ లో కౌన్సెలింగ్ ఇచ్చారన్నారు. ‘అనంతపురం నుంచి మంగళవారం ఉదయం మా ఊరు ముచ్చుకోటకు బయలుదేరాం. శింగనమల వెళ్లేసరికి మా మనవడి నుంచి ఫోన్ వచ్చింది. తాతా.. అమ్మ ఉరివేసుకుంది అన్నాడు’ అని సాయిప్రసాద్ కంటతడి పెట్టుకున్నారు. మోహన్ కృష్ణ ఇతర మహిళలతో తిరుగుతూ, తన కూతుర్ని వేధించాడని చెప్పారు. తన పింఛన్ డబ్బుతో కూతురు ఇల్లు గడుస్తోందన్నారు. ‘పెళ్లయినప్పటి నుంచి నా కూతురుకి నరకం చూపుతున్నాడు. వివాహేతర సంబంధం పెట్టుకుని వేధిస్తున్నాడు. అతనికి ఉరిశిక్ష వేస్తేనే నా కూతురు ఆత్మ శాంతిస్తుంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, హోం మంత్రి అనిత తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని నాలుగో పట్టణ సీఐ జగదీష్ తెలిపారు.