తండ్రి దెబ్బలకు 4 ఏళ్ల బాలిక మృతి.. అంకెలు రాయలేదని కొట్టడంతో..
ABN , Publish Date - Jan 25 , 2026 | 02:33 PM
హర్యానాలోని ఫరీదాబాద్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అంకెలు సరిగా రాయలేకపోయిన తన కూతురిని ఓ వ్యక్తి ఇష్టారీతిన కొట్టడంతో చిన్నారి మృతి చెందింది.
ఇంటర్నెట్ డెస్క్: హర్యానాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అంకెలు సరిగా రాయలేకపోయిందన్న కోపంలో ఓ వ్యక్తి తన కూతురిని ఇష్టారీతిన కొట్టడంతో చిన్నారి మృతిచెందింది. ఫరీదాబాద్లో ఈ ఘటన వెలుగు చూసింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం కృష్ణ జైస్వాల్కు (31) భార్య, ఒక కూతురు ఉన్నారు. ఉత్తర్ప్రదేశ్ సోన్భద్ర జిల్లాకు చెందిన జైస్వాల్ తన కుటుంబంతో కలిసి ఫరీదాబాద్లో ఉంటున్నాడు. భార్యాభర్తలు ఇద్దరూ ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. భార్య ఉదయం పూట ఉద్యోగానికి వెళితే భర్త తమ కూతురి బాగోగులు చూసుకునేవాడు.
ఇదిలా ఉంటే , జనవరి 21న కృష్ణ తన కూతురిని ఒకటి నుంచి 51 వరకూ అంకెలు రాయమని చెప్పాడు. కానీ చిన్నారి రాయలేకపోయింది. దీంతో, కోపంతో ఊగిపోయిన కృష్ణ విచక్షణ మరిచి చిన్నారిని ఇష్టారీతిన కొట్టాడు. దీంతో, బాలికకు తీవ్ర గాయాలయ్యాయి.
ఉద్యోగం ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లి తన కూతురు నిర్జీవంగా పడి ఉండటం చూసి షాకైపోయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు.
తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడికి కోర్టులో హాజరుపరుచగా అతడికి న్యాయస్థానం ఒక రోజు పాటు పోలీస్ రిమాండ్ విధించింది. ఇక చిన్నారి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఇవీ చదవండి:
స్విగ్గీ డెలివరీ ఏజెంట్ను కారుతో ఢీకొట్టిన ప్రభుత్వ డాక్టర్! రోడ్డుపై రద్దీ పెరిగిందని..
కాల్ ఫార్వార్డింగ్ స్కామ్.. ఈ ఉచ్చులో పడితే మీ జేబులు ఖాళీ