ప్లే స్కూల్లో దారుణం.. 3 ఏళ్ల చిన్నారిని కుర్చీకి కట్టేసి..
ABN , Publish Date - Aug 31 , 2026 | 11:32 AM
ప్లే స్కూల్లో తన బిడ్డను కుర్చీకి కట్టేసి హింస పెట్టారంటూ ఓ మూడేళ్ల బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యూఢిల్లీలోని మోజ్పూర్లో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్లే స్కూల్లో తన బిడ్డను కుర్చీకి కట్టేసి హింస పెట్టారంటూ ఓ మూడేళ్ల బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యూఢిల్లీలోని మోజ్పూర్లో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే ప్లేస్కూల్లోని ఆయాను అరెస్టు చేశారు. స్కూల్లోని ఓ టీచర్, ప్రిన్స్పాల్, డైరెక్టర్పై కూడా కేసులు నమోదయ్యాయి.
కొన్ని రోజుల క్రితం పిల్లాడి ప్రవర్తనలో మార్పులను గమనించిన తల్లిదండ్రులు చెక్ చేయగా అతడి ఒంటిపై గాయాలు కనిపించాయి. బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అతడిని ఎవరో కొట్టి ఉండవచ్చని వైద్యుడు సందేహం వ్యక్తం చేశారు. రెండు చెవుల లోపలి భాగాలు వాచాయని చెప్పారు. అంతకుముందు చాలా రోజుల పాటు తమ బిడ్డ బాత్రూమ్కు వెళ్లేందుకు కూడా భయపడేవాడని తల్లిదండ్రులు చెప్పారు. రాత్రిళ్లు ఆపకుండా రోదించేవాడని అన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్లేస్కూల్లోని సీసీటీవీ ఫుటేజీ కావాలని కోరగా స్కూలు యాజమాన్యం రూ.1500 డిమాండ్ చేసిందని చెప్పారు.
వారు అడిగిన మొత్తాన్ని చెల్లించాక సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే జరిగిన దారుణం వెలుగులోకి వచ్చిందని అన్నారు. ఆగస్టు 16, 17, 18 తేదీల్లో తమ బిడ్డను ప్లేస్కూల్ టీచర్, ఆయా కూర్చీకి కట్టేసి, చెవులు లాగి కొట్టారని అన్నారు. ఇదేంటని తాము ప్లే స్కూలు యాజమాన్యాన్ని నిలదీస్తే తమ పిల్లాడు బాగా అల్లరి చేస్తుంటే మందలించామని చెప్పారన్నారు. చిన్నారిని అసభ్యంగా కూడా తాకి ఉండవచ్చని బాలుడి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
పెళ్లి రద్దు చేశారని దారుణం.. యువతి, ఆమె సోదరిపై యాసిడ్ దాడి..
ఒడిశాలో దారుణం.. పాఠశాలలో విద్యార్థినికి మెడికల్ చెకప్ చేస్తుండగా..