దారుణం.. ఫ్రెండ్ కళ్లముందే తుపాకీతో ఛాతిలో కాల్చుకుని..
ABN , Publish Date - Mar 17 , 2026 | 01:35 PM
ఢిల్లీలో తాజాగా దారుణం వెలుగు చూసింది. ఒక వ్యక్తి తనని తాను తుపాకీతో కాల్చుకుని మరణించాడు. అతడి స్నేహితుడి కళ్లముందే కుప్పకూలిపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని న్యూఢిల్లీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి తనని తాను తుపాకీతో కాల్చుకుని మరణించాడు. తన ఛాతికి తుపాకీని గురిపెట్టి కాల్చుకుని కన్నుమూశాడు. అతడి స్నేహితుడు కెమెరాతో రికార్డు చేస్తున్న సమయంలోనే ఈ ఊహించని ఘటన జరిగింది. మృతుడిని పవన్గా పోలీసులు గుర్తించారు. తన కళ్లముందే పవన్ కుప్పకూలిపోవడంతో అతడి స్నేహితుడు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదట్లో పవన్ స్నేహితుడు అతడికి గన్లోకి మ్యాగజీన్ను ఎలా పెట్టాలో సూచించాడు. బటన్ నొక్కగానే అది లోపలికి వెళుతుందని చెప్పాడు. ఆ ప్రకారమే పవన్ మ్యాగజీన్ను తుపాకీలో పెట్టాడు. తుపాకీ ఛాంబర్లో తూటా లోడ్ అయ్యేలా చేశాడు. ఇదంతా కెమెరాతో రికార్డు చేస్తున్న వ్యక్తి వెంటనే పవన్ను అప్రమత్తం చేశాడు. ట్రిగ్గర్ నొక్కవద్దని హెచ్చరించాడు.
కానీ పవన్ తుపాకీని తన ఛాతికి గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కడంతో క్షణాల్లో అనర్థం జరిగిపోయింది. తూటా ఛాతిలోకి దూసుకుపోవడంతో అతడు కుప్పకూలిపోయాడు. దీంతో, పవన్ స్నేహితుడు షాక్కు గురయ్యాడు. ‘ఎంత పని చేశావు భయ్యా..’ అంటూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.
న్యూ అశోక్ నగర్లో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. తూటా తగలడంతో కుప్పకూలిపోయిన వపన్ను వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ కన్నుమూశాడని చెప్పారు. పవన్ వాడిన పిస్టల్ అతడిని రికార్డు చేసిన వ్యక్తిదేనని తెలిపారు. అతడికి ఆయుధ లైసెన్స్ ఉందని కూడా అన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.