Share News

భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి

ABN , Publish Date - Feb 05 , 2026 | 03:59 AM

సొంత అన్నతో నెలకొన్న భూ తగాదా ఆ మహిళా న్యాయవాది ప్రాణం తీసింది. కొందరిని వెంటేసుకొచ్చిన ఆ అన్న, తల్లితో కలిసి భూమిని సర్వే చేయిస్తున్న చెల్లిని కత్తితో గొంతు కోసి హత్యచేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది.

భూ తగాదాలకు మహిళా న్యాయవాది బలి

  • పొలం వద్ద తల్లితో కలిసి సర్వే చేయిస్తున్న చెల్లి గొంతు కోసిన అన్న

  • తీవ్ర గాయాలతో ఆమె మృతి

  • రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఘటన

  • రాజేంద్రనగర్‌, చేవెళ్లలో విధులు బహిష్కరించిన లాయర్లు.. రోడ్డుపై బైఠాయింపు

  • నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌

మొయినాబాద్‌: ఫిబ్రవరి, 4 (ఆంధ్రజ్యోతి) సొంత అన్నతో నెలకొన్న భూ తగాదా ఆ మహిళా న్యాయవాది ప్రాణం తీసింది. కొందరిని వెంటేసుకొచ్చిన ఆ అన్న, తల్లితో కలిసి భూమిని సర్వే చేయిస్తున్న చెల్లిని కత్తితో గొంతు కోసి హత్యచేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది. మొయినాబాద్‌ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గొటికె శాంతయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు, పెద్ద కూతురు, కుమారుడికి పెళ్లిళ్లయ్యాయి. చిన్న కూతురు స్వప్న (34) చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు, పదేళ్ల క్రితం శాంతయ్య మృతి చెందడంతో ఆయన పేరిట ఉన్న 8 ఎకరాలను భార్య వెంకటమ్మ పేరుమీదకు మార్చారు. అందులోంచి వెంకటమ్మ 4 ఎకరాలను కొడుకు రాజు పేరు మీద చేసింది. మిగతా 4 ఎకరాల భూమి తల్లి పేరిటే ఉంది. ఏడాది క్రితం స్వప్నకు తెలియకుండా ఆ భూమిని కుమారుడు రాజు తన పేరిట చేయించుకున్నాడు. ఈ విషయంలో స్వప్న.. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు సదరు 4 ఎకరాలను తిరిగి తల్లి పేరు మీద మార్పించారు. ఆ భూమి తనకే ఇవ్వాలని స్వప్న పట్టుపడుతున్నారు. తల్లితో కలిసి గ్రామంలో ఉంటున్న స్వప్న ఆ పొలంలో వ్యవసాయం చేయిస్తున్నారు. ఆ భూమి విషయంలో కుమారుడు రాజు, కూతురు స్వప్న మధ్య వివాదం నెలకొంది. కాగా 4ఎకరాల్లోంచి ఎకరం భూమిని స్వప్న అమ్మకానికి పెట్టారు. బుధవారం ఉదయం భూమి సర్వే చేసేందుకు స్వప్న, ఆమె తల్లి వెంకటమ్మ పొలం వద్దకు వెళ్లారు, విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు రాజు కొంతమందితో కలిసి అక్కడికి వెళ్లాడు, అక్కడ భూమి విషయంలో రాజు, స్వప్న మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో కొందరితో కలిసి రాజు, స్వప్నపై కత్తితో దాడి చేసి హత్య చేసి పారిపోయారు. స్థానికులు కొంతమంది ఆమెను చికిత్స కోసం మొయినాబాద్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు, తల్లి వెంకటమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భూ వివాదంలో రాజుకు స్వప్నకు మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గతనెల కేతిరెడ్డిపల్లి రోడ్డులో స్వప్న స్కూటీపై వెళుతుండగా ప్రమాదం జరిగింది. తనపై కోపంతో తన అన్న రాజు ఈ ప్రమా దం చేయించాడని స్వప్న పోలీసులకు ఫిర్యా దు చేశారు. రాజును పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే స్వప్న ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తనను తరచూ పిలుస్తున్నారని.. స్వప్న నుంచి వేధింపులు భరించలేక పోతున్నానని రెండు రోజుల క్రితం తన సన్నిహితుల వద్ద రాజు చెప్పుకొన్నట్లు తెలిసింది. భూ వివాదంతో పాటు తనపై హత్యాయత్నం కేసు పెట్టిందనే రాజు ఈ హత్యకు పాల్పడ్డట్లు చెబుతున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.


న్యాయవాదుల ఆందోళన

న్యాయవాది స్వప్న హత్యకు నిరసనగా చేవెళ్ల, రాజేంద్రనగర్‌ కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన న్యాయవాదుల పట్ల ఎస్సై దురుసుగా ప్రవర్తించారని న్యాయవాదులు ఆందోళన చేశారు. స్వప్నను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌- బీజాపూర్‌ జాతీయ రహదారిపై మొయినాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ ముందు ఆందోళన చేశారు. న్యాయవాదు ల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎస్సైని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీసీపీ యోగేశ్‌ గౌతమ్‌ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Updated Date - Feb 05 , 2026 | 03:59 AM