హైదరాబాద్లో ట్రంప్ టవర్స్
ABN , Publish Date - Aug 12 , 2026 | 03:37 AM
హైదరాబాద్ రియల్టీ మార్కెట్లోకి అమెరికాకు చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్.. లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్తో అడుగుపెట్టింది. భారత్లో ట్రంప్ బ్రాండ్కు అధికారిక ప్రతినిధిగా ఉన్న ట్రెబెకా డెవలపర్స్...
కోకాపేట్లోని గోల్డెన్మైల్లో ఒక్కోటి 65 ఫ్లోర్లతో రెండు టవర్ల నిర్మాణం
మొత్తం 450 అపార్ట్మెంట్లు.. రూ.1,800 కోట్ల పెట్టుబడి
దక్షిణ భారతంలో ఇదే అత్యంత ఎత్తైన టవర్
ట్రెబెకా, ఇరా రియల్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి
నాలుగేళ్లలో అందుబాటులోకి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ రియల్టీ మార్కెట్లోకి అమెరికాకు చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్.. లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్తో అడుగుపెట్టింది. భారత్లో ట్రంప్ బ్రాండ్కు అధికారిక ప్రతినిధిగా ఉన్న ట్రెబెకా డెవలపర్స్.. హైదరాబాద్కు చెందిన ఇరా రియల్టీతో కలిసి ఈ ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేస్తోంది. మంగళవారం నాడిక్కడ ట్రెబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా, ఇరా రియల్టీ వ్యవస్థాపకుడు నర్సి రెడ్డి మాట్లాడుతూ.. కోకాపేట్ గోల్డెన్ మైల్ రోడ్లో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఒక్కోటి 65 అంతస్థులతో మొత్తం రెండు టవర్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న ఈ టవర్స్లో మొత్తం 16 పెంట్హౌస్లతో పాటు 450 అపార్ట్మెంట్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ కోసం భూమి ధరను మినహాయించి రూ.1,700 కోట్ల నుంచి రూ.1,800 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు కల్పేష్ మెహతా తెలిపారు. భారత్లో ఇది ఎనిమిదో ట్రంప్ బ్రాండెడ్ ప్రాజెక్ట్ కాగా.. దక్షిణ భారత్లో ఇదే మొదటిదన్నారు. 2014లో ట్రంప్ బ్రాండ్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టగా.. ఇప్పటికే ముంబై, పుణె, గురుగ్రామ్, నోయిడా, కోల్కతాల్లో ప్రాజెక్టులను ప్రారంభించింది. ఈ ఏడాది చివరలో హైదరాబాద్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభించి నాలుగేళ్లలో ట్రంప్ టవర్స్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెహతా తెలిపారు.
ఒక్కో ఫ్లాట్ ధర రూ.5-10 కోట్లు: హైదరాబాద్లో అభివృద్ధి చేస్తున్న ట్రంప్ టవర్స్లో 3.5, 4 బీహెచ్కే ఫ్లాట్ల ధరలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్యన ఉన్నాయని మెహతా వెల్లడించారు. ఈ ఫ్లాట్ల అమ్మకాల ద్వారా రూ.3,500 కోట్ల నుంచి రూ.4,200 కోట్ల వరకు వస్తాయని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ట్రంప్ ప్రాజెక్ట్కు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఇప్పటికే కొన్ని బుకింగ్స్ వచ్చాయన్నారు.
రూ.62 కోట్లకు పెంట్హౌస్ విక్రయం: ఈ టవర్స్లో మొత్తం 16 పెద్ద పెంట్హౌస్లను నిర్మిస్తుండగా.. ఇందులో 8 పెంట్హౌ్సలను ఇప్పటికే రూ.250 కోట్లకు విక్రయించినట్లు కల్పేష్ మెహతా తెలిపారు. ఒక పెద్ద పెంట్హౌ్సను రూ.62 కోట్లకు విక్రయించినట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ రియల్టీ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోందని, ట్రంప్ టవర్స్ భాగ్యనగరానికి ఒక ఐకానిక్గా నిలుస్తుందని మెహతా అన్నారు.
ఇవి కూడా చదవండి
భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్
నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్