Share News

‘జీ’చంద్ర కేసులో ఐదుగురు సభ్యుల బెంచ్‌ ఏర్పాటు

ABN , Publish Date - Sep 01 , 2026 | 03:48 AM

జీ న్యూస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ చానెళ్ల వ్యవస్థాపకుడు, ఎస్సెల్‌ గ్రూప్‌ చైర్మన్‌ సుభాష్‌ చంద్రపై వ్యక్తిగత దివాలా పరిష్కార కేసులో జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్‌...

‘జీ’చంద్ర కేసులో ఐదుగురు సభ్యుల బెంచ్‌ ఏర్పాటు

  • ఎన్‌సీఎల్‌టీ చరిత్రలో ఇదే తొలిసారి

  • నేడు ఉదయం కేసు విచారణకు..

న్యూఢిల్లీ: జీ న్యూస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ చానెళ్ల వ్యవస్థాపకుడు, ఎస్సెల్‌ గ్రూప్‌ చైర్మన్‌ సుభాష్‌ చంద్రపై వ్యక్తిగత దివాలా పరిష్కార కేసులో జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఐదుగురు సభ్యుల బెంచ్‌ను ఏర్పాటు చేసింది. ఎందుకంటే, ఇప్పటివరకు జరిగిన ఈ కేసు విచారణలో మెజారిటీ అభిప్రాయం సాధ్యపడకపోవడంతో వ్యవహారం మళ్లీ ఎన్‌సీఎల్‌టీ ప్రెసిడెంట్‌ వద్దకు వెళ్లింది. దాంతో ఏకంగా ఐదుగురు సభ్యులతో కూడిన బెంచ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్‌సీఎల్‌టీ చరిత్రలో ఇంతమంది సభ్యులతో బెంచ్‌ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. ఈ బెంచ్‌కు ప్రెసిడెంట్‌ జస్టిస్‌ అనుపిందర్‌ సింగ్‌ గ్రేవాల్‌ అధ్యక్షత వహించనున్నారు. మిగతా సభ్యుల జాబితాలో బచ్చు వెంకట్‌ బలరామ్‌ దాస్‌, మహేంద్ర ఖండేల్‌వాల్‌, అతుల్‌ చతుర్వేది, రవీంద్ర చతుర్వేది ఉన్నా రు. మంగళవారం ఉదయం 10.15 గంటలకు కొత్త బెంచ్‌ ఈ కేసు విచారణను ప్రారంభించనుంది.

గత బెంచ్‌ సభ్యుల్లో భిన్నాభిప్రాయంతోనే..

నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో పలువురు రుణదాతల నుంచి రూ.22,006.57 కోట్ల బకాయిల రికవరీ కోసం క్లెయిమ్‌లు రాగా.. సుభాష్‌ చంద్ర కేవలం రూ.6.5 కోట్ల తిరిగి చెల్లింపులు ఆఫర్‌ చేసిన విషయం తెలిసిందే. అంటే, రుణదాతలకు రావాల్సిన మొత్తంలో 99.97 శాతం (రూ.20,000 కోట్లు) కోతపడనుంది. ఈ కేసులో ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ సభ్యులైన అశోక్‌ కుమార్‌ భరద్వాజ్‌ (జుడీషియల్‌), రీనా సిన్హా పురి (టెక్నికల్‌) గతంలోనూ భిన్నంగా తీర్పిచ్చారు. దాంతో ఎన్‌సీఎల్‌టీ ఫోరమ్‌ ప్రెసిడెంట్‌ నీలేశ్‌ శర్మ (జుడీషియల్‌)ను మూడో సభ్యుడిగా నియమించారు. చంద్ర ఆఫర్‌ను తిరస్కరించిన రుణదాతల వాదనలను తోసిపుచ్చిన నీలేశ్‌ శర్మ.. ఐబీసీ చట్టంలో సెక్షన్‌ 114 ప్రకారంగా ఈనెల 26న ప్లాన్‌ను ఆమోదించారు. అయితే, కంపెనీల చట్టం 2013లో సెక్షన్‌ 419(5)లో భాగంగా మెజారిటీ అభిప్రాయానికి అనుగుణంగా అధికారిక తీర్పు కోసం మూ డో సభ్యుడి ఉత్తర్వును అసలు బెంచ్‌కు తిరిగి పంపారు. కేసును పునఃపరిశీలించినప్పటికీ మెజారిటీ అభిప్రాయం లభించలేదని సోమవారం బెంచ్‌ పేర్కొంది. ‘‘మూడో సభ్యుడు స్వతంత్రంగా ఓ ఉత్తర్వును జారీ చేశారు. తద్వారా, ఎటువంటి మెజారిటీ అభిప్రాయం వెలువడలేదు. కాబట్టి, తుది తీర్పును జారీ చేయలేమ’’ని ఎన్‌ఎస్‌ఎల్‌టీ బెంచ్‌ సభ్యులు ఆశోక్‌ కుమార్‌, రీనా సిన్హా పేర్కొన్నారు. దాంతో వ్యవహారాన్ని తిరిగి ఎన్‌సీఎల్‌టీ ప్రెసిడెంట్‌ వద్దకు పంపారు.

ఇవి కూడా చదవండి

ఎడ్యుకేషన్ హబ్‌గా హుస్నాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్

రామ మందిరానికి రూ.4 కోట్ల విరాళం.. అకౌంట్లో మాత్రం రూ.3!

Updated Date - Sep 01 , 2026 | 03:48 AM