ఐటీ షేర్లు జిగేల్
ABN , Publish Date - Jul 11 , 2026 | 04:48 AM
భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. శుక్రవారం ట్రేడింగ్లో సెన్సెక్స్ 827.57 పాయింట్ల వృద్ధితో 77,569.39 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 244.10 పాయింట్లు ఎగబాకి...
సెన్సెక్స్ 827 పాయింట్లు అప్
మళ్లీ 24,000 ఎగువకి నిఫ్టీ
ముంబై: భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. శుక్రవారం ట్రేడింగ్లో సెన్సెక్స్ 827.57 పాయింట్ల వృద్ధితో 77,569.39 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 244.10 పాయింట్లు ఎగబాకి 24,206.90 వద్ద ముగిసింది. మార్కెట్ దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎ్ఫసీ బ్యాంక్తో పాటు ఐటీ రంగ షేర్లు ర్యాలీ తీయడం ఇందుకు దోహదపడింది. ప్రస్తుత త్రైమాసికంలో ఐటీ సేవలకు డిమాండ్ మళ్లీ మెరుగుపడవచ్చని టీసీఎస్ అభిప్రాయపడటంతో ఈ రంగ షేర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు పెంచారు. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, ముడిచమురు ధరల తగ్గుదల కూడా ట్రేడింగ్ సెంటిమెంట్ను బలపరిచాయి. కొనుగోళ్ల జోరుతో ఈక్విటీ మదుపరుల సంపదగా భావించే బీఎ్సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ మరో రూ.5.81 లక్షల కోట్లు పెరిగి రూ.481.75 లక్షల కోట్లకు (5.05 లక్షల కోట్ల డాలర్లు) చేరింది. రెండు రోజుల్లో మార్కెట్ సంపద రూ.10.52 లక్షల కోట్లు పెరిగింది.