Share News

స్మార్ట్‌ఫోన్లు మరింత ప్రియం

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:10 AM

దేశంలో స్మార్ట్‌ఫోన్ల ధరలు మరింత ప్రియమవుతున్నాయి. ప్రముఖ మొబైల్‌ బ్రాండ్లు రియల్‌మీ, ఒప్పో, వివో, సామ్‌సంగ్‌, వన్‌ప్ల్‌స ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచేశాయి. ఫోన్ల తయారీలో...

స్మార్ట్‌ఫోన్లు మరింత ప్రియం

ధరలు పెంచిన రియల్‌మీ, ఒప్పో, వివో, సామ్‌సంగ్‌, వన్‌ప్ల్‌స

చిప్‌ల రేట్లు పెరగడమే ప్రధాన కారణమంటున్న కంపెనీలు

న్యూఢిల్లీ: దేశంలో స్మార్ట్‌ఫోన్ల ధరలు మరింత ప్రియమవుతున్నాయి. ప్రముఖ మొబైల్‌ బ్రాండ్లు రియల్‌మీ, ఒప్పో, వివో, సామ్‌సంగ్‌, వన్‌ప్ల్‌స ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచేశాయి. ఫోన్ల తయారీలో కీలకమైన మెమొరీ, చిప్‌సెట్ల ధరలు పెరగడమే ఇందుకు కారణమని కంపెనీలంటున్నాయి. పశ్చిమాసియా సంక్షోభంతో పెరిగిన ధరాఘాతం కారణంగా వినియోగదారులు ఆచితూచి ఖర్చు చేస్తున్న నేపథ్యంలోనూ మొబైల్‌ కంపెనీలు రేట్లు పెంచడం గమనార్హం. దేశంలో స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు ఇప్పటికే మందగించాయని.. ఈ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక సేల్స్‌ క్రితం సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే బాగా తగ్గాయని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తాజా నోట్‌లో వెల్లడించింది.

ఎవరెంత పెంపు..?

  • ఈ నెల 18 నుంచి రియల్‌మీ పలు మోడళ్ల రేట్లను రూ.1,000 నుంచి రూ.4,000 వరకు పెంచింది.

  • ఒప్పోకు చెందిన రెనో, ఏ సిరీ్‌సలో ఎంపిక చేసిన మోడళ్ల ధరలు రూ.5,000 వరకు ఎగబాకాయి.

  • కొన్ని ప్రాంతాల్లో వివోకు చెందిన పలు మోడళ్లు రూ.500 నుంచి రూ.4,000 వరకు ప్రియమయ్యాయి.

  • సామ్‌సంగ్‌ తన ఎస్‌, ఎం, ఎఫ్‌ సిరీ్‌సలోని ఎంపిక చేసిన ఫోన్ల ధరలను మరింత పెంచేసింది. గెలాక్సీ ఎస్‌25లో ఒక వేరియంట్‌ రేటు రూ.12,000 మేర పెరిగింది.

  • వన్‌ ప్లస్‌ కూడా ఎంపిక చేసిన ఫోన్ల ధరలను రూ.2,000-4,000 శ్రేణిలో పెంచింది.

మరో 7-10% పెరిగే చాన్స్‌!

మెమొరీ, చిప్‌సెట్ల ధరల పెరుగుదల కారణంగా ఈ ఏడాది జూన్‌ నాటికి భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల సగటు ధరలు దాదాపు 15 శాతం వరకు పెరిగాయని ఐడీసీ ఏషియా పసిఫిక్‌ సీనియర్‌ రీసెర్చ్‌ మేనేజర్‌ ఉపాసన జోషి అన్నారు. చిప్‌లతోపాటు మొబైల్‌ విడిభాగాల ధరలు పెరుగుతూనే పోతున్నాయని.. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ల రేట్లు కూడా మున్ముందు నెలల్లో మరో 7-10 శాతం వరకు పెరగవచ్చని ఆమె అంచనా వేశారు. మొబైల్‌ ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగిందని, దాంతో కంపెనీలకు కొంత భారాన్ని వినియోగదారుల పైకి బదిలీ చేయక తప్పడంలేదని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ శభమ్‌ సింగ్‌ అన్నారు. కంపెనీలు కొత్త మోడళ్లను కూడా అధిక ధరలతోనే లాంచ్‌ చేస్తున్నాయని అన్నారు.


పండగ సీజన్‌ రాయితీలపై ఆశలు

అధిక ధరలు స్మార్ట్‌ఫోన్ల విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. గతనెలలో అమెజాన్‌ ప్రైమ్‌డే సేల్‌, ఫ్లిప్‌కార్ట్‌ గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైం (గోట్‌) సేల్‌లో భాగంగా కంపెనీలు మంచి డిస్కౌంట్లు ఆఫర్‌ చేయడంతో మొబైల్‌ సేల్స్‌ కాస్త పుంజుకున్నప్పటికీ, ఆ తర్వాత వరుసగా మూడు వారాల్లో అమ్మకాలు మళ్లీ తగ్గాయి. ఈసారి పండగ సీజన్‌లో మొబైల్‌ బ్రాండ్లు మళ్లీ రాయితీలు, ఫైనాన్సింగ్‌ పథకాలు, కొత్త మోడళ్లను ఆఫర్‌ చేస్తే గనుక విక్రయాలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుందని కౌంటర్‌పాయింట్‌ భావిస్తోంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో స్మార్ట్‌ఫోన్‌ సేల్స్‌ వార్షిక ప్రాతిపదికన 13 శాతం తగ్గాయని, పండగ సీజన్‌ సేల్స్‌తో ద్వితీయార్ధంలో మార్కెట్‌ కాస్త మెరుగుపడవచ్చని కంపెనీ రీసెర్చ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాథక్‌ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 21 , 2026 | 06:10 AM