పబ్లిక్ ఇష్యూకు రత్నదీప్ రిటైల్
ABN , Publish Date - Jul 03 , 2026 | 03:01 AM
రత్నదీప్ పేరుతో సూపర్ మార్కెట్లను నిర్వహిస్తున్న హైదరాబాద్ సంస్థ రత్నదీప్ రిటైల్ లిమిటెడ్ కూడా తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) సిద్ధమైంది. ఇందుకు అనుమతి కోరుతూ...
తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.400 కోట్ల సమీకరణ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): రత్నదీప్ పేరుతో సూపర్ మార్కెట్లను నిర్వహిస్తున్న హైదరాబాద్ సంస్థ రత్నదీప్ రిటైల్ లిమిటెడ్ కూడా తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) సిద్ధమైంది. ఇందుకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు (డీఆర్హెచ్పీ) సమర్పించింది. ఈ ఐపీఓలో భాగంగా తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.400 కోట్లు సమీకరించనున్నట్లు డీఆర్హెచ్పీలో కంపెనీ వెల్లడించింది. అలాగే, కంపెనీ ప్రమోటర్లైన సందీప్ అగర్వాల్, మనీశ్ భార్తియా, మితేశ్ భార్తియా, యశ్ అగర్వాల్, కవిత అగర్వాల్ తమ వాటాకు చెందిన 1.49 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్ఫఎస్) ద్వారా విక్రయించనున్నారు.
తాజా ఈక్విటీ ద్వారా సమీకరించే నిధుల నుంచి రూ.260 కోట్లతో కొత్త స్టోర్లను ఏర్పాటు చేయటంతో పాటు రూ.40 కోట్లను రుణాల చెల్లింపులకు, మిగిలిన మొత్తాలను ఇతర వ్యాపార అవసరాలకు ఉపయోగించుకోనున్నట్లు డీఆర్హెచ్పీలో రత్నదీప్ వెల్లడించింది. కాగా, ప్రీ-ఐపీఓ ప్లేస్మెంట్ ద్వారా రూ.80 కోట్లు సమీకరించే ఆలోచన కూడా ఉందని, అదే జరిగితే ఐపీఓలో తాజా ఈక్విటీ జారీ సైజును తదనుగుణంగా తగ్గించుకోనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం రత్నదీప్ రిటైల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ఫుడ్, కిరాణా, ఫ్యాషన్ ఉత్పత్తుల రిటైల్ విక్రయ స్టోర్లను నిర్వహిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ.2,223 కోట్లుగా ఉండగా నికర లాభం రూ.36.7 కోట్లుగా ఉంది.
కార్ల్స్బర్గ్ రూ.6,600 కోట్ల ఐపీఓ: డెన్మార్క్కు చెందిన బ్రూవరీ దిగ్గజం కార్ల్స్బర్గ్కు చెందిన భారత విభాగం కార్ల్స్బర్గ్ ఇండియా లిమిటెడ్ ఐపీఓకు రానుంది. ఇందుకు అనుమతి కోరుతూ సెబీకి డీఆర్హెచ్పీ సమర్పించింది. ఐపీఓ వివరాలు బయటకు వెల్లడించాల్సిన అవసరం లేకుండా కాన్ఫిడెన్షియల్ ఫైలింగ్ మార్గాన్ని ఎంచుకుంది. అయితే, ఐపీఓ ద్వారా సంస్థ రూ.6,650 కోట్ల వరకు సమీకరించనుందని సమాచారం.
స్వర బేబీ ప్రొడక్ట్స్ రూ.1,000 కోట్ల ఇష్యూ : బేబీ, అడల్ట్ డైపర్ల కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్ స్వర బేబీ ప్రొడక్ట్స్ ఐపీఓ ద్వారా రూ.1,000 కోట్ల వరకు సమీకరించేందుకు అనుమతి కోరుతూ సెబీకి డీఆర్హెచ్పీ ఫైల్ చేసింది.
పార్లే-జీ సైతం..: పార్లే-జీ బిస్కెట్లతో పాటు మ్యాంగో బైట్, మెలోడీ చాక్లెట్ల తయారీ కంపెనీ పార్లే ప్రొడక్ట్స్ లిమిటెడ్ సైతం ఐపీఓకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఐపీఓ ద్వారా సంస్థ రూ.9,500 కోట్లకు పైగా నిధులు సమీకరించే ఉందని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి..
మీ పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోండి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్