పశ్చిమాసియా యుద్ధంపై బేఫికర్
ABN , Publish Date - Apr 07 , 2026 | 03:31 AM
పశ్చిమాసియా యుద్ధంతో ఈ సంవత్సరం మన దేశం గత ఏడాది కంటే పెద్ద సవాళ్లు ఎదుర్కొంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయినా మన...
పెట్టుబడులకు ఢోకా లేదు
అవసరమైన రంగాలకు ఆసరా
వడ్డీ రేట్లు తగ్గించేందుకూ సిద్ధమే
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధంతో ఈ సంవత్సరం మన దేశం గత ఏడాది కంటే పెద్ద సవాళ్లు ఎదుర్కొంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయినా మన మూలధన పెట్టుబడులకుగానీ, ఆర్థిక వ్యవస్థకుగానీ పెద్దగా వాటిల్లే నష్టమేమీ లేదన్నారు. ఈ యుద్ధంతో నష్టపోయే రంగాలను ఆదుకునేందుకు అవసరమైన నిధులకూ ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇంకా అవసరమైతే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశమూ ఉందన్నారు. గత పదేళ్లుగా తమ ప్రభుత్వం దూరదృష్టి తో అమలు చేస్తున్న ఆర్థిక క్రమశిక్షణ, విధానాలు ఇందుకు దోహదం చేస్తాయన్నారు. ఈ సౌలభ్యం వల్లే ఇటీవల పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకాలు తగ్గించడం, కీలక పెట్రో రసాయన ఉత్పత్తులకు దిగుమతి సుంకాల మినహాయింపు, సెజ్ల్లో ఎగుమతుల కోసం ఏర్పాటు చేసిన కంపెనీలు తమ ఉత్పత్తిలో కొంత భాగాన్ని దేశీయ మార్కెట్లో అమ్ముకునేందుకు అనుమతి వంటి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ఆర్థిక మంత్రి చెప్పారు.
మన రుణ భారం తక్కువే
ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే మన దేశ రుణ బారం తక్కువగానే ఉందని ఆర్థిక మంత్రి సీతారామన్ అన్నారు. ప్రస్తుతం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అప్పులన్నీ కలిపినా జీడీపీలో మన అప్పుల భారం 81 శాతానికి మించి లేదన్నారు. 2030 నాటికి ఇది 75.8 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. విదేశీ రుణ భారమూ గత ఏడాది సెప్టెంబరు నాటికి జీడీపీలో 19.1 శాతం మాత్రమేనన్నారు. గత పదేళ్లుగా ముందు చూపుతో తమ ప్రభుత్వం అమలు చేసిన ఆర్థిక క్రమ శిక్షణ, విధానాలే ఇందుకు కారణమన్నారు.
ఈ వార్తలూ చదవండి:
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు..