Share News

60 నుంచి 90 రోజులకు..

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:28 AM

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత ప్రభుత్వం అత్యవసర ఇంధన నిల్వల సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 60 రోజుల నుంచి 90 రోజులకు పెంచుకోవాలనుకునే యోచనలో...

60 నుంచి 90 రోజులకు..

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన నిల్వల సామర్థ్యం పెంపు యోచనలో కేంద్రం

ప్రస్తుతం 2 నెలలకు సరిపడా నిల్వలు

న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత ప్రభుత్వం అత్యవసర ఇంధన నిల్వల సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 60 రోజుల నుంచి 90 రోజులకు పెంచుకోవాలనుకునే యోచనలో ఉందని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఇంధన భద్రత వ్యవస్థను పునఃసమీక్షిస్తోందని, అందులో భాగంగానే ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చిందన్నారు. పశ్చిమాసియాలో పరిస్థితులు కాస్త కుదురుకున్న తర్వాత ముడి చమురు, పెట్రో ఉత్పత్తుల నిల్వల సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని ప్రభుత్వ రంగ ఇంధన కంపెనీలను కేంద్రం ఆదేశించనుందని అధికారి చెప్పారు. ఎందుకంటే, మన దేశీయ ఇంధన అవసరాల్లో 89 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతోంది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత్‌ 24,070 కోట్ల డాలర్ల విలువైన ముడి చమురు, బంగారం, వంట నూనెలను దిగుమతి చేసుకుంది. 2025-26లో నమోదైన మొత్తం దిగుమతులు 77,500 కోట్ల డాలర్లలో వీటి వాటాయే 31 శాతం. అందులో ముడి చమురు దిగుమతుల విలువ 13,470 కోట్ల డాలర్లుగా ఉంది.

ఇరాన్‌ నియంత్రణలో ఉన్న హోర్ముజ్‌ జలసంఽధి దిగ్బంధనంతో గత 3 నెలలుగా ముడి చమురు సహా ఇతర కమోడిటీల సరఫరా దాదాపు స్తంభించిపోయింది. పైగా క్రూడాయిల్‌ ధరలూ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చైనా తరహాలో మనమూ అత్యవసర ఇంధన నిల్వల సామర్థ్యాన్ని భారీగా పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రస్తుతం చైనా 6 నెలల అత్యవసర ఇంధన నిల్వల సామర్థ్యాన్ని కలిగి ఉంది. భారత్‌ మాత్రం రెండు నెలలకు సరిపడా నిల్వలను కలిగి ఉంది. ప్రభుత్వ వ్యూహాత్మక నిల్వలతోపాటు ఆయిల్‌ రిఫైనరీలు, ఇంధన విక్రయ సంస్థ వద్దనున్న నిల్వలన్నీ కలిపి ఈ అత్యవసర ఇంధన నిల్వల పరిధిలోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం, మంగళూరు, పాడూరులో మొత్తం 53.3 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో కూడిన వ్యూహాత్మక ముడి చమురు నిల్వల కేంద్రాలను ఏర్పాటు చేసింది.


భారత్‌లో యూఏఈ నిల్వలు ఐదింతలకు పెంపు

భారత్‌లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కు చెందిన ముడి చమురు నిల్వల సామర్థ్యాన్ని ఐదింతలకు పెంచే దిశగా కసరత్తు జరుగుతోంది. యూఏఈలోని భారత రాయబారి దీపక్‌ మిట్టల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‌లో అబుదాబీ నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ (అడ్నాక్‌) కలిగి ఉన్న క్రూడాయిల్‌ నిల్వల సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 58 లక్షల బ్యారళ్ల నుంచి 3 కోట్ల బ్యారళ్లకు పెంచే ఆలోచన ఉందన్నారు. భారత్‌-యూఏఈ సంయుక్తంగా మన దేశంలో వ్యూహాత్మక గ్యాస్‌ నిల్వలను కూడా అభివృద్ధి చేయనున్నట్లు ఆయన చెప్పారు. యూఏఈకి చెందిన నిల్వలే అయినప్పటికీ, అత్యవసర సమయాల్లో మనకూ ఉపయోగపడతాయి. పైగా, ఈ నిల్వల నుంచి ఇతర దేశాలకు విక్రయం, సరఫరాలోనూ భారత్‌ తన వంతు పాత్ర పోషించేందుకు అవకాశం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి..

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..

మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

Updated Date - Jun 12 , 2026 | 05:28 AM