డాక్టర్ రెడ్డీస్ లాభంలో 69 శాతం క్షీణత
ABN , Publish Date - Jul 23 , 2026 | 05:08 AM
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్.. జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి గాను కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్.. జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి గాను కంపెనీ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏకంగా 69.2 శాతం క్షీణించి రూ.434.80 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.1,409.60 కోట్లుగా ఉంది. సెమాగ్లుటైడ్ యాక్టివ్ ఫార్మా ఇన్గ్రిడియెంట్స్ (ఏపీఐ)కు సంబంధించి కేటాయింపులు చేయటం, అమెరికా జెనరిక్స్ ఆదాయాలు గణనీయంగా తగ్గటం పనితీరుపై ప్రభావం చూపించిందని డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. కాగా సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం కూడా రూ.8,545.20 కోట్ల నుంచి రూ.8,070.50 కోట్లకు పడిపోయింది. ఈ కాలంలో మొత్తం వ్యయాలు రూ.3,115.20 కోట్ల నుంచి రూ.3,375.60 కోట్లకు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. జూన్ త్రైమాసికంలో సెమాగ్లుటైడ్ ఏపీఐకి సంబంధించిన ఇన్వెంటరీలతో పాటు ఇతరత్రా వ్యయాల కోసం రూ.239.70 కోట్లు కేటాయించటం తీవ్ర ప్రభావం చూపించిందని డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ కో చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. సెమాగ్లుటైడ్లో ఉపయోగించే ఏపీఐలో కొన్ని లోపాలు గుర్తించటంతో కంపెనీ వీటి సరఫరాలను నిలిపివేసిందని, త్వరలోనే అన్ని చర్యలు తీసుకుని సరఫరాలను పునరుద్ధరించనున్నట్లు ఆయన చెప్పారు. కాగా దీర్ఘకాలంలో మెరుగైన వృద్ధిని సాధించేందుకు పెప్టైడ్స్, బయోసిమిలర్స్తో పాటు ఇన్నోవేటివ్ ఉత్పత్తులపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు ప్రసాద్ వెల్లడించారు.
అమెరికా ఆదాయం రూ.2,205 కోట్లు: జూన్ త్రైమాసికంలో అమెరికా ఆదాయాలు 35 శాతం క్షీణించినట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. ఈ కాలంలో అమెరికా ఆదాయం రూ.3,412.30 కోట్ల నుంచి రూ.2,204.80 కోట్లకు తగ్గిందని పేర్కొంది. మరోవైపు గ్లోబల్ జెనరిక్స్ రెవెన్యూలు కూడా 5 శాతం క్షీణతతో రూ.7,562 కోట్ల నుంచి రూ.7,199.30 కోట్లకు తగ్గాయి. యూరప్ ఆదాయాలు మాత్రం 13 శాతం వృద్ధితో రూ.1,444 కోట్లకు చేరుకోగా భారత ఆదాయం 17 శాతం పెరిగి రూ.1,717.70 కోట్లకు చేరుకుందని వెల్లడించింది.
క్యూ1లో రూ.435 కోట్లుగా నమోదు అమెరికా ఆదాయంలో 35% తగ్గుదల
యూఎస్లో ఔషధ ధరలు పెరుగుతాయ్..: జెనరిక్ ఔషధాలపై సుంకాలను విధించటం అమెరికాకే నష్టమని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సీఈఓ ఎరెజ్ ఇజ్రాయెలీ అన్నారు. సుంకాల పెంపుతో అమెరికాలో ఔషధాల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కంపెనీల కార్యకలాపాలను అమెరికాకు తరలించటం సాధ్యం కాదన్నారు. టారి్ఫలు అమల్లోకి వస్తే అందుకు తగ్గట్టుగా తాము కూడా ఔషధాల ధరలు పెంచాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ట్రంప్ టారిఫ్ పెంపు ప్రకటనను మదింపు చేస్తున్నామ ని, అవసరమైతే అమెరికాలో భాగస్వామ్యాలు కుదుర్చుకునే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..
2028 నుంచి 100% సుంకాలు, ఆ తర్వాత 200%.. జనరిక్ మందులపై ట్రంప్ కీలక నిర్ణయం..
పసిడి ధరలు మరింత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..