తుస్సుమన్న కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు!
ABN , Publish Date - Sep 05 , 2026 | 02:04 AM
దేశంలో భారీగా ఉన్న బొగ్గు, లిగ్నైట్ నిక్షేపాల్లో కొంత భాగాన్ని సింథటిక్ గ్యాస్ (సిన్గ్యాస్)గా మార్చాలన్న ప్రభుత్వ ప్రయత్నం ఫలించేలా లేదు
ఏమాత్రం ఆసక్తి చూపని కంపెనీలు
న్యూఢిల్లీ: దేశంలో భారీగా ఉన్న బొగ్గు, లిగ్నైట్ నిక్షేపాల్లో కొంత భాగాన్ని సింథటిక్ గ్యాస్ (సిన్గ్యాస్)గా మార్చాలన్న ప్రభుత్వ ప్రయత్నం ఫలించేలా లేదు. ఇందుకు ఆసక్తి ఉన్న కంపెనీలు ఈ నెల 7వ తేదీ లోగా తమ బిడ్స్ను సమర్పించాలని కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జూలై 7వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు ముందుకు వచ్చే కంపెనీలకు అవసరమైన ఆర్థిక ప్రోత్సాహకాలు అందించేందుకు రూ.37,500 కోట్లతో ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ పథకం కింద కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ఇప్పటి వరకు ఒక్క కంపెనీ నుంచి కూడా ప్రతిపాదన (బిడ్) అందలేదని అధికార వర్గాలు చెప్పాయి. దీంతో కోల్ గ్యాసిఫికేషన్తో ఎల్ఎన్జీ, ఎరువులు, కొన్ని కీలక రసాయనాల దిగుమతులకు చెక్ పెట్టాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపించడం లేదు. సాంకేతిక సమస్యలతో పాటు ఈ ప్రాజెక్టులు గిట్టుబాటు అవుతాయో లేదోననే కంపెనీల అనుమానాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు.