తయారీకి ఊతం..
ABN , Publish Date - Feb 02 , 2026 | 07:01 AM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఆర్థిక వృద్ధికి బాటలు వేయటంతో పాటు దేశీయంగా తయారీ రంగానికి ఊతమిచ్చే విధంగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు...
వికసిత్ భారత్ లక్ష్యంగా కీలక రంగాలపై దృష్టి
ట్రంప్ సుంకాల పోటును తట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఆర్థిక వృద్ధికి బాటలు వేయటంతో పాటు దేశీయంగా తయారీ రంగానికి ఊతమిచ్చే విధంగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పోటుతో అల్లాడిపోతున్న రంగాలను అదుకునేందుకు బడ్జెట్లో మంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తయారీ రంగాన్ని పరుగులు పెట్టించి 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు రేర్ ఎర్త్ మాగ్నెట్స్, సెమీకండక్టర్ చిప్స్, టెక్స్టైల్, బయో ఫార్మా, ఎలకా్ట్రనిక్ ఉపకరణాల విడిభాగాల తయారీ, రసాయనాలు, క్యాపిటల్ గూడ్స్ వంటి ఏడు రంగాలను వ్యూహాత్మక ప్రాధాన్యతా రంగాలుగా ప్రకటించారు. ఇందులో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, సెమీకండక్టర్ చిప్స్ ఇప్పటికే చైనా ఆంక్షలతో అల్లాడిపోతున్నాయి. ఇక టెక్స్టైల్స్ గురించైతే చెప్పాల్సిన పనే లేదు. ట్రంప్ సుంకాల పోటుతో టెక్స్టైల్ ఎగుమతులు ఇప్పటికే నీరసించాయి. ఈ ఏడు రంగాలను పరుగులు పెట్టించడం ద్వారా ఆత్మ నిర్భరత సాధించాలన్నది మోదీ సర్కార్ లక్ష్యంగా కనిపిస్తోంది. భవిష్యత్ అవసరాలు, ఎగుమతి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని బయో ఫార్మా అభివృద్ధికి రూ.10,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం దేశీయ ఫార్మా రంగానికి మరింత కలిసి రానుంది. ఇదే సమయంలో ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్తో స్టాక్ మార్కెట్లో చేతులు కాల్చుకుంటున్న చిన్న, రిటైల్ మదుపరులను కట్టడి చేసేందుకూ ఆర్థిక మంత్రి ప్రత్యేక చర్యలు ప్రకటించారు.
కంటైనర్ల తయారీకి రూ.10,000 కోట్లు
దేశంలో కంటైనర్ల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం బడ్జెట్లో ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో రూ.10,000 కోట్లు కేటాయించనున్నట్లు సీతారామన్ వెల్లడించారు. ప్రపంచ స్థాయిలో పోటీపడగలిగే కంటైనర్ల తయారీ వ్యవస్థను దేశీయంగా అభివృద్ధి చేసేందుకు ఈ పథకం దోహదపడనుందన్నారు. పర్యావరణ హితమైన సరుకు రవాణాను ప్రోత్సహించేందుకు, కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్వి్పమెంట్ (సీఐఈ)ను పెంచే పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. అత్యాధునిక, అత్యున్నతమైన సీఐఈని దేశీయంగా తయారు చేసేందుకు ఈ పథకం దోహదపడనుందన్నారు.

బయోఫార్మా హబ్గా భారత్
భారత్ను బయోఫార్మా తయారీ హబ్గా తీర్చిదిద్దేందుకు వచ్చే ఐదేళ్లలో రూ.10,000 కోట్ల పెట్టుబడులను ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రతిపాదించారు. బయోఫార్మా శక్తి కార్యక్రమం దేశంలో బయోలాజిక్స్, బయోసిమిలర్స్ ఉత్పత్తికి అవసరమైన ఆవరణ వ్యవస్థ మరింతగా అభివృద్ధి చెందేందుకు దోహదపడనుందని అన్నారు. అలాగే, దేశవ్యాప్తంగా 1,000 క్లినికల్ ట్రయల్ కేంద్రాల ఏర్పాటుతో పాటు ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎ్ససీఓ)ను బలోపేతం చేయనున్నట్లు సీతారామన్ ప్రకటించారు. బయోఫార్మాస్యూటికల్స్ లేదా బయోలాజిక్స్ క్లిష్ట ఔషధాలు. వీటిని రసాయనాలకు బదులు జీవులు, కణాలు, కణజాలల నుంచి తయారు చేస్తారు. దేశంలో మధుమేహం, క్యాన్సర్, ఆటోఇమ్యూన్ డిజార్డర్ తో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అందుబాటు ధరలో దీర్ఘాయువు, జీవ నాణత్యను అందించడంలో బయోలాజిక్స్ కీలకమని మంత్రి పేర్కొన్నారు. బయోఫార్మా శక్తిలో భాగంగా మూడు కొత్త నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఎన్ఐపీఈఆర్, నైపర్)తో కూడిన బయోఫార్మా కేంద్రీకృత నెట్వర్క్ ఏర్పాటుతో పాటు ఇప్పటికే ఏర్పాటైన 7 నైపర్స్ను సైతం ఆధునికీకరించనున్నట్లు మంత్రి తెలిపారు.

చిప్ల తయారీకి బూస్ట్
సెమీ కండక్టర్ మిషన్ 2.0 ప్రకటన
ఈసీఎంఎ్సకు రూ.40,000 కోట్లు
దేశీయంగా చిప్ల తయారీని ప్రోత్సహించేందుకు ఈసారి బడ్జెట్లో కేంద్రం ‘ఇండియా సెమీకండక్టర్స్ మిషన్ (ఐఎస్ ఎం) 2.0’ను ప్రకటించింది. ‘‘ఐఎ్సఎం 1.0 దేశీయ సెమీకండక్టర్ రంగ సామర్థ్యాలను విస్తరించింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఐఎ్సఎం 2.0ను ప్రారంభిస్తాం. దేశంలోనే చిప్ల తయారీకి అవసరమైన యంత్రాలు, సామాగ్రిని ఉత్పత్తి చేయడంతోపాటు ఫుల్ స్టాక్ ఇండియన్ ఐపీ డిజైనింగ్, ఈ రంగ సరఫరా వ్యవస్థను బలపరిచేందుకు కొత్త పథకం లక్ష్యమని’’ ఆర్థిక మంత్రి నిర్మల అన్నారు. పరిశోధనతో పాటు సాంకేతికత, నిపుణుల తయారీ కోసం శిక్షణ కేంద్రాల ఏర్పాటుపైనా దృష్టిసారించనున్నట్లు ఆమె చెప్పారు. దేశంలో ఎలకా్ట్రనిక్స్ పరికరాల తయారీ పథకానికి (ఈసీఎంఎస్) భారీ స్పందన లభించిన నేపథ్యంలో ఈ స్కీమ్కు కేటాయింపులను కూడా రెట్టింపు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ‘‘2025 ఏప్రిల్లో రూ.22,909 కోట్లతో ప్రారంభించిన ఈసీఎంఎస్ లక్ష్యానికి రెండింతల పెట్టుబడులను ఆకర్షించింది. ఈ రంగంలోకి పెట్టుబడుల జోరు కొనసాగేందుకు వీలుగా ఈ పథకానికి కేటాయింపులను దాదాపు రెట్టింపు స్థాయి రూ.40,000 కోట్లకు పెంచుతున్నా’’మని బడ్జెట్ ప్రసం గంలో సీతారామన్ పేర్కొన్నారు.

ఎంఎస్ఎంఈల కోసం రూ.10,000 కోట్ల ఫండ్
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి బడ్జెట్లో రూ.10,000 కోట్ల ఫండ్ సహా త్రిముఖ వ్యూహాన్ని ప్రకటించారు. ఆర్థిక వృద్ధికి కీలకమైన ఎంఎ్సఎంఈలను విజేతలుగా తీర్చిదిద్దేందుకు ఈక్విటీ, ద్రవ్య, వృత్తిపరమైన మద్దతును ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఈక్విటీ మద్దతు కోసం రూ.10,000 కోట్ల ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్తోపాటు సూక్ష్మ పరిశ్రమల కోసం 2021లో ఏర్పాటు చేసిన సెల్ఫ్ రిలయంట్ ఫండ్కు మరో రూ.2,000 కోట్లు కేటాయించారు. ద్రవ్య మద్దతు కోసం టీఆర్ఈడీఎస్ (ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్)ను పూర్తి సామర్థ్యం మేరకు వినియోగించుకునేందుకు మంత్రి ప్రణాళికలు ప్రకటించారు. ఎంఎ్సఎంఈలకు వృత్తిపరంగా సాయపడేలా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కార్పొరేట్ మిత్రుల కేడర్ను అభివృద్ధి చేయనున్నట్లు సీతారామన్ తెలిపారు. ఎంఎ్సఎంఈలకు నిబంధనలకు అనుగుణమైన అవసరాలను తక్కువ ధరలో అందించేందుకు ఈ కేడర్ సాయపడనుంది.
ఇవీ చదవండి:
ఆ సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే: మంత్రి నిర్మలా సీతారామన్
2019 నుంచి 2026 వరకు.. 9 బడ్జెట్లు.. 14 గంటల ప్రసంగం..