అనిల్ అంబానీకి దక్కని ఊరట.. పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
ABN , Publish Date - Apr 16 , 2026 | 03:21 PM
అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అనిల్ అంబానీ వేసిన పిటిషన్పై విచారణ జరిపింది. ‘ఇది డబ్బును పక్కదారి పట్టించిన కేసు. మేము ఈ దశలో ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలనుకోవడం లేదు. మీకు చట్టపరమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయి’ అని బెంచ్ పేర్కొంది. బ్యాంకులు ఇచ్చిన షోకాజ్ నోటీసులపై హైకోర్టు సింగిల్ బడ్జి బెంచ్ వద్ద వాదనలు వినిపించుకోవడానికి అనిల్ అంబానీకి అనుమతినిచ్చింది. ఈ ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని హైకోర్టుకు సూచించింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 మాస్టర్ డైరెక్షన్స్ నిబంధనల ప్రకారం.. అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రుణ ఖాతాలను బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లిమిటెడ్, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్లు ‘మోసపూరితమైనవి’గా వర్గీకరించాయి. అనిల్తో పాటు రిలయన్స్ కమ్యూనికేషన్స్పై చర్యలకు సిద్ధం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అనిల్ అంబానీ 2025లో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అనిల్ అంబానీ వాదనలు విన్న హైకోర్టు సింగిల్ జడ్జి.. బ్యాంకుల నిర్ణయంపై 'స్టే' విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బ్యాంకులు హైకోర్టు డివిజన్ బెంచ్ ముందుకు వెళ్లాయి. బ్యాంకులు వేసిన పిటిషన్పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. బ్యాంకులు తమ విచారణ ప్రక్రియను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. తీర్పు బ్యాంకులకు సానుకూలంగా రావటంతో అనిల్ అంబానీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేశారు. అయితే, అనిల్ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సమర్థించింది. బ్యాంకులకు సానుకూలంగా తీర్పును ఇచ్చింది.
ఇవి కూడా చదవండి
వేగంగా తినే అలవాటు బరువు పెరగడానికి కారణమవుతుందా?
'దోశ, ఇడ్లీ' పాటపై బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు..