Share News

డీజిల్‌ కొరతను అధిగమిస్తాం

ABN , Publish Date - Apr 28 , 2026 | 01:00 AM

జిల్లాలో మూడు ఆయిల్‌ కంపెనీల పరిధిలో 232 పెట్రోల్‌ అవుట్‌ లెట్లకు గాను 52 చోట్ల నిల్వలు అడుగం టాయి. ఇందులో 22చోట్ల సోమవారం రాత్రికి లోడ్‌ నింపుతాం. మంగళవారానికి అన్ని సర్దుకుం టాయి. ఎవరూ ఆందోళన పడవద్దు’ అని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు.

డీజిల్‌ కొరతను అధిగమిస్తాం

ఏలూరు, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి):జిల్లాలో మూడు ఆయిల్‌ కంపెనీల పరిధిలో 232 పెట్రోల్‌ అవుట్‌ లెట్లకు గాను 52 చోట్ల నిల్వలు అడుగం టాయి. ఇందులో 22చోట్ల సోమవారం రాత్రికి లోడ్‌ నింపుతాం. మంగళవారానికి అన్ని సర్దుకుం టాయి. ఎవరూ ఆందోళన పడవద్దు’ అని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై కలెక్టరేట్‌లో ఎస్పీ ప్రతాప కిశోర్‌తో కలిసి కలెక్టర్‌ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. ‘ప్రసార మాధ్యమాల్లో కొరత ఉంటుందనే ఆం దోళనతో ఎక్కువ మంది పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు చేసుకోవడం వల్ల బంకులు ఖాళీ అవుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లు, వరి కోతలకు డీజిల్‌ కొరత లేకుండా ఆయా ప్రాంతాల వారీగా అధికారులతో రైతు సేవా కేంద్రాల ద్వారా గుర్తింపును చేపడుతున్నాం. ఇబ్బందులు వున్న చోట్ల కూపన్లు పంపిణీ చేసి డీజిల్‌ సరఫరా చేయిస్తున్నాం. నూజివీడులో మామిడి సరఫరాకు, కైకలూరు, ఉంగుటూరులో ఆక్వాకు ఇబ్బందులు లేకుండా డీజిల్‌ కూపన్లు అందజేశాం. రైతులకు విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా పావు గంటలోనే పవర్‌ పునరుద్దరణ చేస్తున్నాం. ఈ సమస్యలపై కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 75692 96272 ద్వారా ఆయిల్‌ కంపె నీలు, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నా’మన్నారు. ఎస్పీ కిశోర్‌ మాట్లాడు తూ ‘అన్ని పెట్రోల్‌ బంకుల వద్ద స్టాకు నిల్వల రికార్డులను తనిఖీలు చేశాం. ఎక్కడ అక్రమంగా నిల్వ ఉంచి అమ్మినా వారిపై పీడీ యాక్టు కింద కేసులను నమోదు చేస్తామని హెచ్చరించాం. బంకుల వద్ద రద్దీ నివారణకు పోలీస్‌ సిబ్బందితో క్యూ పద్దతిని వినియోగిస్తున్నాం. భయాందోళనలతో పెట్రోలు, డీజిల్‌ ట్యాంకులు పుల్‌ చేయడం ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని, ఇందుకు ప్రజలు సహకరించా ల’న్నారు. జేసీ అభిషేక్‌ గౌడ మాట్లాడుతూ ప్రతీ పెట్రోల్‌ బంకు పరిధిలో రోజూ వారీ సగటున 350 కిలోలీటర్ల వినియోగం ఉండగా, ప్రస్తుతం 500 కిలోలీటర్లు కొనుగోలు జరగడం వలే సమస్య ఉత్పన్నం అవుతోందన్నారు. సమావేశంలో ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ రెడ్డి, డీఎస్‌వో విలియమ్స్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌ బంకుల తనిఖీ

కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎస్పీ కిశోర్‌, జేసీ అభిషేక్‌ గౌడ, జిల్లా అధికారులు కలిసి ఏలూరు నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఫైర్‌స్టేషన్‌లో భారత్‌ పెట్రోలియం బంకును ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంకుల్లో వున్న డీజిల్‌, పెట్రోల్‌ నిల్వలపై యజమానిని ఆరా తీశారు. స్టాక్‌ రిజిస్టర్లను పరిశీలించి, సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదన్నారు.

అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌

జిల్లాలో డీజిల్‌ కొరత అంశంపై వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్‌ వెట్రి సెల్వి వేర్వేరుగా టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఏ బంక్‌లోను పెట్రోలు, డీజిల్‌ ఆయిల్‌ కొరత పరిస్థితి తలెత్తకుండా ట్యాంకర్లు పంపేలా చర్యలు తీసుకోవాలని కంపెనీల ప్రతినిధులను కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆదేశించారు.

ఆర్టీసీకి డీజిల్‌ కొరత లేదు

ఏలూరు జిల్లాలో ఆర్టీసీ బస్సులకు ఎక్కడా డీజిల్‌ కొరత లేదని డీపీటీవో షేక్‌ షబ్నం తెలిపారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు పరిధిల్లోని డిపోల పరిధి 225కుపైగా ఆర్టీసీ బస్సు సర్వీసులను నడుపుతున్నారు. మొత్తం 22,500 లీటర్ల డీజిల్‌ వినియోగం జరుగుతోంది. మూడు బంకుల్లోను సరిపడినంత నిల్వలు ఉన్నాయని వివరించారు.

Updated Date - Apr 28 , 2026 | 01:00 AM