Share News

రవాణాకు ఊతం !

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:20 AM

తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం కావాలంటూ దశాబ్దాలుగా కోరుకుంటున్నారు.తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు మూడు అలైన్‌మెంట్‌లను ప్రతిపాదిస్తున్నారు. ఇప్ప టికే రెండింటిని సిద్ధం చేశారు. కుంచనపల్లి పరిధిలో మరో అలైన్‌మెంట్‌ రూపొందించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు

రవాణాకు ఊతం !
వెంకట్రామన్నగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రతిపాదించిన పొలాలు

తాడేపల్లిగూడెంలో విమానాశ్రయానికి

మూడు అలైన్‌మెంట్‌లు

ఇటీవల కేంద్ర బృందం పరిశీలన..

కొత్త డిజైన్‌ రూపొందించాలని సూచన

ఇప్పటికే రెండు సిద్ధం చేసిన అధికారులు

కుంచనపల్లి పరిధిలో మరొకటి

ఐదు కిలోమీటర్ల రన్‌వే ఉండేలా ప్రతిపాదన

భీమవరం/నరసాపురం, మే 31 (ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు మూడు అలైన్‌మెంట్‌లను ప్రతిపాదిస్తున్నారు. ఇప్ప టికే రెండింటిని సిద్ధం చేశారు. కుంచనపల్లి పరిధిలో మరో అలైన్‌మెంట్‌ రూపొందించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు.ఇదివరకే తాడేపల్లిగూడెం రూరల్‌ మండలంలో వెంకట్రామన్నగూడెం, జగన్నపేట గ్రామాల్లో 1,123 ఎకరాలను గుర్తించారు. ఇటీవల కేంద్ర పౌర విమానయాన బృందం పరిశీలించింది. రెండు గ్రామాలకు ఆనుకుని తాడిపూడి కాలువ ఉంది. దానికి దూరంగా ఐదు కిలో మీటర్ల రన్‌ వే ఉండేలా అలైన్‌మెంట్‌ రూపొందించాలని కేంద్ర బృందం సూచించింది.సమీపంలో రాజమండ్రి, గన్న వరం విమానాశ్రాయాలు ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. అయితే ఇక్కడ ఉన్న వనరులు, ఏపీ నిట్‌, ఉద్యాన విశ్వవిద్యాలయం, పారిశ్రామిక ప్రగతి వంటి విషయాలను ఎమ్మెల్యే బొలిశెట్టితో పాటు అధికారులు కూడా కేంద్ర బృందానికి వివరించారు. దీనిపై సంతృప్తి చెందిన కేంద్ర బృందం కొత్త డిజైన్‌ రూపొందించాలని సూచించింది. ఆ మేరకు అలైన్‌మెంట్‌లు సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతానికి రెండు అలైన్‌మెంట్‌లను రూపొందించారు. వెంక ట్రామన్నగూడెం, జగన్నపేట పరిధిలో భూములను మార్చారు. అలాగే కడియద్ద, నీలాద్రిపురం, వెంకట్రామన్నగూడెం పరిధిలో భూములు కలిసేలా మరొక అలైన్‌మెంట్‌ రూపొందించినట్టు సమా చారం. గతంలో గుర్తించిన భూములకు సంబంధించి కొందరు రైతులు వ్యతిరేకించారు. వెంకట్రా మన్నగూడెంలో ఓ రైతు న్యాయపరమైన పోరాటం చేస్తానంటూ చెప్పుకొస్తు న్నారు. అదే రైతు మరికొందరి రైతులను కూడగట్టి భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమంటూ ప్రకటించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక అలైన్‌మెంట్‌కు పరిమితం కాకూడదని జిల్లా యంత్రాంగం ఆలోచిస్తోంది.

కుంచనపల్లి సేఫ్‌గా ఉంటుందా ?

వెంకట్రామన్నగూడెం పరిధిలో తోటలున్నాయి. కుంచనపల్లి రెవెన్యూ పరిధిలో అఉటవంటి సమస్య లేదు. మరోవైపు బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన రన్‌వే ఆకారంలోనే తాజా అలైన్‌మెంట్‌లో రన్‌వే ఉంటుంది. ఇది కూడా రూపొందించి కేంద్రానికి పంపాలని అధికారులు నిర్ణయిం చారు. మొత్తం మూడు అలైన్‌మెంట్‌లను పంపనున్నారు. వాటిని కేంద్ర పౌర విమానయాన బృందం పరిశీలించ నుంది. మరోసారి భూముల పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాతే కమిటీ నివేదిక ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తదనుగుణంగా విమానాశ్రయం ఏర్పాటు ఆధారపడి ఉంటుంది. తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం కావాలంటూ దశాబ్దాలుగా కోరుకుంటున్నారు. గల్ఫ్‌ దేశాలతో పాటు, ఇతర దేశాల్లోనూ ఉమ్మడి జిల్లా నుంచి ఉపాధికోసం అత్యధిక సంఖ్యలో తరలి వెళ్లారు. వారందరికీ కనెక్టివిటీ ఎయిర్‌పోర్టు తాడేపల్లిగూడెం అయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు కార్గో అవసరాలు తీరనున్నాయి,

నేటి నుంచి మారనున్న రైల్వేజోన్‌

సౌత్‌ కోస్టు పరిధిలోకి ఉమ్మడి జిల్లాలో 46 రైల్వే స్టేషన్లు

ఉమ్మడి జిల్లాలో రైల్వేకు మహర్దశ పట్టనుంది. రాష్ట్ర విభజనతో కేంద్రం ఇచ్చిన హామీ అమలు చేయడంతో కొత్తగా సౌత్‌ కోస్టు రైల్వే ఏర్పడింది. ఇప్పటివరకు జిల్లాలోని రైల్వేస్టేషన్లన్నీ సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో ఉన్నాయి. పాలన అంతా సికింద్రాబాద్‌ నుంచి జరిగేది. సోమవారం నుంచి విశాఖ కేంద్రంగా కొత్త పాలన ప్రారంభం కానుంది. 60 ఏళ్ల తరువాత జోన్‌ విభజన కావడంతో ఉమ్మడి పశ్చిమలో 46 రైల్వేస్టేషన్లు కొత్త రైల్వేజోన్‌ పరిధిలోకి వెళ్లనున్నాయి. రైల్వే అధికారులంతా కొత్త జోన్‌లో పనిచేసేందుకు రెడీ అవుతు న్నారు. ప్రస్తుతం జిల్లాలోని రైల్వే స్టేషన్లన్నీ విజయవాడ డివిజన్‌ పరిధిలో ఉన్నాయి.

పాలన మరింత సులభం

దేశంలో రైల్వే జోన్‌లలో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అతి పెద్దది. ఆంధ్ర, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని స్టేషన్లు ఈ జోన్‌ పరిధిలో ఉన్నాయి. డివిజన్ల సంఖ్య కూడా ఎక్కువుగా ఉండేది. ఈ కారణంగా పాలన కష్టతరంగా ఉండేది. ప్రతి చిన్న విషయానికి సికింద్రాబాద్‌ వెళ్లాల్సి వచ్చేది. ఉద్యోగ నియమాకాల్లో కూడా పోటీ ఎక్కువుగా ఉండేది.ఉద్యోగుల సంఖ్య ఎక్కువుగా ఉండటం వల్ల పదోన్న తులు కూడా త్వరగా వచ్చేవి కావు. కొత్త రైళ్లు పట్టాలు ఎక్కించాలన్నా అన్ని జోన్‌లకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండేది. విశాఖ జోన్‌తో ఈ కష్టాలకు చెక్‌ పడనుంది. ప్రస్తుతం కొత్త డివిజన్‌లో నాలుగు డివిజన్‌లు మాత్రమే ఉన్నాయి. దీనివల్ల పెండింగ్‌ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కొత్త రైళ్లు పట్టాలెక్కేందుకు ఛాన్స్‌ ఉంది. జిల్లాలోని నిరుద్యోగులకు రైల్వేలో జాబ్‌లు దొరికే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో భీమవరం, ఏలూరు జిల్లా కేంద్రాలుగా ఉన్నాయి. తాడేపల్లిగూడెం, ఏలూరు మెయిన్‌ లైన్‌లో ఉండగా, భీమవరం, తణుకు బ్రాంచ్‌ లైన్‌లో ఉన్నాయి. ఇక నరసాపురం స్టేషన్‌ జిల్లాకు చివరలో ఉండటం వల్ల ప్రధాన రైళ్లన్నీ ఇక్కడ నుంచే ప్రారంభమవు తున్నాయి. రానున్న రోజుల్లో ఈ స్టేషన్‌ మరింత అభివృద్ధికి నోచుకుని జంక్షన్‌గా ఏర్పడే అవకాశం ఉంది.

Updated Date - Jun 01 , 2026 | 12:20 AM