ఆశలు తీర్చేనా..?
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:22 AM
నేడు కేంద్ర బడ్జెట్. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై ఉమ్మడి పశ్చిమ వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
నేడు నిర్మలమ్మ కేంద్ర బడ్జెట్
పోలవరానికి అదనపు నిధులు ఇచ్చేనా ?
మచిలీపట్నం, కోటిపల్లి, కొవ్వూరు రైల్వేలైన్లకు గ్రీన్ సిగ్నల్ పడేనా ?
జాతీయ రహదారులు కొలిక్కి వచ్చేనా ?
బంగారంపై పన్ను పెరిగేనా.. తగ్గేనా ?
ఆక్వా, వరి రైతులకు శుభవార్త చెప్పేనా ?
స్టాక్ మార్కెట్పై మదుపుదారుల ఆశలు
నేడు కేంద్ర బడ్జెట్. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై ఉమ్మడి పశ్చిమ వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పోలవరం ప్రాజెక్టు, నరసాపురం–కోటిపల్లి, కొవ్వూరు–భద్రాచలం రైల్వే లైన్, పరిశ్రమలు, విద్యా సంస్థలకు నిధుల కేటాయింపు, జాతీయ రహదారుల విస్తరణ, ఆక్వా రైతులకు వరాలు, ఆకాశానికి పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేకులు పడేలా ఏం చర్యలు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
నరసాపురం, జనవరి 31(ఆంధ్రజ్యోతి):
డాలర్తో రూపాయి మారకం రూ.92కు చేరింది. జీడీపీ ఐదు శాతానికి వృద్ధి చెందినా సామాన్యుల జీవ న విధానంలో మార్పు రాలేదు. చాలా వస్తువులపై జీ ఎస్టీ తగ్గించినా కొన్నింటి ధరలు తగ్గుముఖం పట్టలే దు. నిత్యావసర వస్తువులు కొండెక్కి కూర్చొన్నాయి. గిట్టుబాట ధర లేక రైతులు ఆకాశం వైపు చూస్తు న్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారా మన్ అదివారం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఏ వరాలు కురి పిస్తారోనని అన్న టెన్షన్ అన్ని వర్గాల్లో నెలకొంది.
పుష్కరాల ముందే పోలవరం
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును 2027 ఆగ స్టులో జరిగే పుష్కరాలకంటే ముందే పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ధీమాగా వున్నారు. ప్రాజెక్టుకు ఏటే టా అంచనాలు పెరుగుతున్న తరుణంలో 2027 మార్చి నాటికి నూతన డయా ఫ్రం వాల్ నిర్మాణంతోపాటు, సమాంతరంగా అన్ని పనులు చక్కబెట్టాలి. కేంద్రం బడ్జెట్లో అదనపు నిధులను పెంచాలి. కూటమి ప్రభు త్వం వచ్చాక పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అదనపు నిధుల కోరింది. సవరించిన అంచనాలతో రూ.55 వేల కోట్లకు అభ్యర్థన పంపింది. ఇందులో కేంద్రం మొదటి విడతగా రూ.12,911 కోట్లను కేటాయించింది. ఇందులో ఐదు వేల 936 కోట్లు మాత్రమే మాత్రమే కేటాయించారు. ఈ బడ్జెట్లో ఆరు వేల కోట్లకంటే అదనంగా ఇవ్వాలి.
కొవ్వూరు– భద్రాచ లం లైన్ క్లియర్ చేస్తారా?
కొవ్వూరు–భద్రాచలం రైల్వేలైన్కు ఈసారైనా మోక్షం లభిస్తుందని ఆశిస్తున్నారు. సర్వే పూర్తయినా ఇంకా కేం ద్రం వరకు డీపీఆర్ వెళ్లలేదు. మ్యాపింగ్, మార్పులతో కొంత జాప్యం చోటు చేసుకుంది. రూ.2,800 కోట్లతో డీపీఆర్ సిద్ధం కావాలి. కనీసం ఈ లైనుకు మెరుగైన మొత్తాలను కేటాయిస్తారా ? అన్న ప్రశ్న తలెత్తుతోంది.
హైవే రహదార్లపై ఆసక్తి
ఇక హైవే రహదార్లపై ఎన్నో ఆశలు ఉన్నాయి. ప్రస్తుతం పాలకొల్లు నుంచి ఆకివీడు వరకు ప్రతిపాదించిన 165 జాతీయ రహదారి పనులు పెండింగ్ పడ్డాయి. ఆకివీడు నుంచి పామర్రు వరకు చేపట్టిన నాలుగు లైన్ల పనులు 70 శాతం పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుకు రూ.2,500 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు. బడ్జెట్లో ఏ మేరకు నిధులు వస్తాయో వేచి చూడాలి. నరసాపురం నుంచి అమలాపురం వరకు 216 జాతీయ రహదారిని పోర్లైన్గా మార్చేందుకు నోటిఫికేషన్ ఇచ్చి సర్వే కూడా చేపట్టారు. ఈ సారి బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు నిధులు ఇస్తారని ఆశ తీర ప్రాంత వాసుల్లో నెలకొంది.
బంగారం ధరల నియంత్రణకు
ప్రస్తుతం బంగారంపై ఆరు శాతం కస్టమ్స్ డ్యూటీ ఉంది. గత బడ్జెట్లో 15 నుంచి 8 శాతం పన్ను మినహాయింపు ఇచ్చారు. మూడు శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం వెండి, బంగారం ధరలు ఆల్ టైం రికార్డులు దాటేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటి నియంత్రణకు పన్నులు పెంచవచ్చన్న ఊహాగానాలు బులియన్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
అక్వా రైతుల్లో
బడ్జెట్పై ఆక్వా, వ్యవసాయ రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ట్రంప్ సుంకాలతో అమెరికాకు ఎగుమతులు ఆగిపోయాయి. ప్రభుత్వం ఎన్ని సబ్సిడీలు ఇస్తున్నా ఎగుమతులు లేకపోవడంతో రైతులు నష్టాలను మూట గట్టుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ రైతులపై ఏం వరాల జల్లు కురిస్తుందో అన్నది హాట్ టాఫిక్గా మారింది. వ్యవసాయ రంగానికి గిట్టుబాటు ధరలు పెంచుతారన్న ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు
ఇక మదుపుదారుల్లో కోటి ఆశలు
ఈ సారి బడ్జెట్లో స్టాక్ మార్కెట్ మదుపుదారులు పన్నుల నుంచి మినహాయింపు వస్తుందని కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే స్వల్పకాల, దీర్ఘకాల లాభాలపై 12 నుంచి 15 శాతం కేపిటల్ గెయిన్స్ పేరిట పన్ను విధిస్తున్నారు. ఈ పన్ను ఈ సారి మినహాయిస్తారన్న ఊహాగానాలు మార్కెట్లో నెలకొన్నాయి. ఇది కాకుండా ట్రంప్ సుంకాలతో గత ఏడాదిగా స్టాక్ మార్కెట్ కుదేలైంది. విదేశీ పెట్టుబడిదారులు తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం మార్కెట్పై ఎలాంటి వరాలు కురుస్తుందోనన్నది ఆసక్తికరంగా మారింది.
జీఎస్టీ తగ్గినా..ధరలు పెరుగుదల ఆగలేదు
జీఎస్టీ అమలులో భాగంగా వివిధ శ్లాబ్లను తగ్గించినా.. ఇంకా నిత్యావసరాలు పెరుగుదల ఆగనేలేదు. రైతులకు,ఇతర వేతన జీవులకు మేలు చేకూరే రాయితీల ప్రస్తావన ఉంటుందా? అన్న చర్చ సాగుతోంది.
రైల్వే ప్రాజెక్టులపై ఏం చేస్తారో ?
11 ఏళ్లుగా కోటిపల్లి– నరసాపురం రైల్వే పనులు నిధులు లేక నత్తనడకన సాగుతున్నా యి. గత బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు రూ.400 కోట్లు కేటాయించారు. ఈ సారి ఏ మేరకు ఇస్తారో చూడాలి. విశాఖ–విజయ వాడ మధ్య మెయిన్లైన్ ట్రాఫిక్ పెరిగింది. ఈ నేపథ్యంలో కొత్త రైల్వేలైన్ కీలకంగా మారింది.
నరసాపురం–మచిలీపట్నం మధ్య కొత్త రైల్వేలైన్ ప్రతిపాదనకు వచ్చింది. తీర ప్రాంత వెంబడి నిర్మించే ఈ లైన్ వల్ల మొగల్తూరుతోపాటు కృష్ణా జిల్లాలోని అనేక తీర గ్రామాల్లో రైలు కూత విని పించనుంది. మచిలీపట్నం నుంచి బాపట్ల, ఒంగో లుకు వెళ్లే మెయిన్లైన్కు కొత్త రైల్వేలైన్ అను సంధానం కానుంది. ఈ సారైనా నిధులు కేటాయి స్తారా ? ఆసక్తికరంగా మారింది.