ఉగాదికి గృహమస్తు
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:25 AM
ఈ.. ఉగాదికి పేదల సొంతింటి కల నేరవేరనున్నది. టిడ్కో ఇళ్లు వేగంగా పూర్తి ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 17న తిరుపతి జిల్లాలో నాయుడు పేటలో లబ్ధిదారులకు ఇళ్లు అందించనున్నారు.
సిద్ధమవుతున్న టిడ్కో ఇళ్లు
17న లబ్ధిదారులకు అందించేలా ఏర్పాట్లు
భీమవరంలో 1,920..పాలకొల్లులో 2,016 ... మొత్తం 3,936 ఇళ్లు
ఉరుకులు పరుగులతో పనులు
భీమవరం టౌన్, మార్చి 14 (ఆంఽధ్రజ్యోతి) : ఈ.. ఉగాదికి పేదల సొంతింటి కల నేరవేరనున్నది. టిడ్కో ఇళ్లు వేగంగా పూర్తి ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 17న తిరుపతి జిల్లాలో నాయుడు పేటలో లబ్ధిదారులకు ఇళ్లు అందించనున్నారు. అదేరోజున జిల్లాలో కూడా లబ్ధిదారులకు ఇళ్లు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉగాది నాడు గృహ ప్రవేశాలు జరిగేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.గత వైసీపీ హయంలో టిడ్కో ఇళ్లను పట్టించుకోలేదు. నిర్మించిన ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్లపై దృష్టి పెట్టింది. పేదలకు ఇళ్లు అప్పగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పనులను వేగవంతం చేసింది. జిల్లాలో భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెంలలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టగా ఇప్పటికే తాడేపల్లిగూడెంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి సంక్రాంతి పండుగకు కొంతమందికి అందించారు. భీమవరం, పాలకొల్లులలో ఉగాది కానుకగా ఇళ్లు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో ఉరుకులు పరుగులతో పనులు పూర్తి చేస్తున్నారు.
భీమవరంలో ఇలా..
భీమవరంలో మొత్తం 8,352 ఇళ్లు నిర్మాణం పూర్తిచేసి ఇవ్వవలసి ఉంది. ఇప్పటికే 1,984 ఇళ్లు పూర్తిచేసి అందించారు. ఇంకా 6,368 ఇళ్ల నిర్మాణం చేసి అందించాల్సి ఉంది. అందులో ప్రస్తుతం ఉగాది నాటికి 1,920 ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. 365 ఎస్ఎఫ్టీలో 960 ఇళ్లు, 430 ఎస్ఎఫ్టీలో 960 ఇళ్లు నిర్మాణం పూర్తిచేశారు. మొత్తం 1,920 అందిస్తారు. వచ్చే జూన్ నాటికి మిగిలిన 4,448 ఇళ్లు పూర్తిచేసి అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. పూర్లయిన ఇళ్ల ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా కావలసి మౌలిక సదుపాయాలను కల్పించారు. రోడ్ల నిర్మాణం, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా నిర్మాణం పూర్తి అయింది.
పాలకొల్లులో..
పాలకొల్లుకు సంబంధించి 63 బ్లాక్ల్లో 2016 ఇళ్ల నిర్మాణం పూర్తి చెయ్యాల్సి ఉంది. 300 ఎస్ఎఫ్టీలో 832 ఇళ్లు , 430 ఎస్ఎఫ్టీలో 1,184 నిర్మాణం పూర్తిచేశారు. ఇతర పనులన్నీ పూర్తయితే ఉగాది నాడు అందించే అవకాశం ఉంది. పెండింగ్లో 48 బ్లాక్లో 1,536 ఇళ్లు పూర్తి చెయ్యవలసి ఉంటుంది.