సర్కార్ బడికి వెళదాం..
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:21 AM
ప్రభుత్వ బడులకు పూర్వవైభవం వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న అడ్మిషన్లు
పెనుమంట్ర, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బడులకు పూర్వవైభవం వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటుకు దీటుగా మెరుగైన ఫలితాలు సాధించారు. క్వాలిఫైడ్ టీచర్స్తో విద్యాబోధన, మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫాం, బుక్స్ వంటి సౌకర్యాలతో పాటు ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. పెనుమంట్ర మండలం కొయ్యేటిపాడు గ్రామంలో మోడల్ స్కూలులో గతేడాది 40 మంది విద్యార్థులు ఉండేవారు..ఈ ఏడాది ఆ సంఖ్య 80 మందికి చేరింది. మాముడూరు ప్రాథమిక పాఠశాల రెగ్యులర్ స్కూల్లో కేవలం ఆరుగురే ఉండేవారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో 67 మందికి బోధన అందిస్తున్నారు. ప్రతీ తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకువస్తున్న సంస్కరణల కారణంగా విదార్థుల చేరిక పెరుగుతోందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతీ గ్రామంలో ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకున్నట్టు ఎంఈవో ఉంగరాల నాగేశ్వరరావు వివరించారు.