నూజివీడు సుందరీకరణకు శ్రీకారం
ABN , Publish Date - May 11 , 2026 | 12:48 AM
నూజివీడు పురపాలక సంఘంగా ఏర్పడి 43 ఏళ్లు గడిచింది. అయినా ప్రధాన వీధుల్లో ఎలాంటి మార్పు లేదు. పట్టణంలో ప్రధాన రోడ్లు ఇరుకుగా ఉండడం పెరిగిన ట్రాఫిక్తో పట్టణవాసులు ఇబ్బందులు పడుతున్నారు. రెండుసార్లు ప్రధాన వీధుల విస్తరణకు గత పాలకులు ప్రయత్నించినా ఓట్లు రాజకీయంతో విస్తరణ సాధ్యపడలేదు.
మొఘల్ చెరువు సుందరీకరణ
(నూజివీడు – ఆంధ్రజ్యోతి)
నూజివీడు పురపాలక సంఘంగా ఏర్పడి 43 ఏళ్లు గడిచింది. అయినా ప్రధాన వీధుల్లో ఎలాంటి మార్పు లేదు. పట్టణంలో ప్రధాన రోడ్లు ఇరుకుగా ఉండడం పెరిగిన ట్రాఫిక్తో పట్టణవాసులు ఇబ్బందులు పడుతున్నారు. రెండుసార్లు ప్రధాన వీధుల విస్తరణకు గత పాలకులు ప్రయత్నించినా ఓట్లు రాజకీయంతో విస్తరణ సాధ్యపడలేదు. నూజివీడు చుట్టు పక్కల ఉన్న ప్రధాన పంచాయతీలైన హను మాన్ జంక్షన్, విస్సన్నపేట, తిరువూరులలో మాత్రం ప్రధాన వీధులను ఇప్పటికే డివైడర్లు ఏర్పాటు చేసి విస్తరణ జరిపారు.
విస్తరణ పనులు
నూజివీడు పట్టణ జనాభా దాదాపు లక్ష జనాభా ఉంది. ఎట్టకేలకు ప్రధాన వీధుల విస్తరణకు శ్రీకారం జరిగింది. మంత్రి పార్థసారథి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రధాన వీధుల విస్తరణ జరిపి నూజివీడు పట్టణాన్ని మోడల్ టౌన్గా తీర్చిదిద్దుతానని వాగ్దానం చేశారు. ఆ మేరకు అమలులో భాగంగానే నూజివీడు ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి పెట్రోల్ బంక్ సెంటర్ వరకు రహదారి విస్తరణ జరిపి డివైడర్ను ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించారు. ఈప్రాంతం వరకు ప్రభుత్వ భూమి ఉంది. మొగల్ చెరువు వద్ద గల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురై వివిధ షాపులు నిర్మించబడి ఉన్నాయి. వీటిని ఖాళీ చేయించి ఆ ప్రాంతంలో పురపాలక సంఘం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి అక్రమణదారులకే అద్దెకు ఇవ్వడానికి మంత్రి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు ఆక్ర మణదారులను ఒప్పించారు. అయితే ఈ నిర్మాణం వల్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఉపయోగ పడదు. అసలు ట్రాఫిక్ సమస్య పెట్రోల్ బంక్ సెంటర్ నుంచి బస్టాండ్ వరకు, చిన్న గాంధీ బొమ్మ సెంటర్ నుంచి పెద్ద చెరువు కళింగ వరకు రహదారిని విస్తరించి డివైడర్లను ఏర్పాటు చేసినప్పుడే ట్రాఫిక్ సమస్యకు కొంత వరకు పరిష్కారం లభిస్తుంది. ఈప్రాంతం అంతా కమర్షియల్ ప్రాంతం కావడంతో రహదారికి రెండు వైపులా భూసేకరణ జరపాలంటే నిబంధనల ప్రకారం అధిక వ్యయం అవుతుంది. సుమారు మూడు న్నర కిలోమీటర్ల వరకు రహదారి విస్తరణను జరిపినప్పుడే పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఒక కొలిక్కి వస్తుంది. ఈ దిశగా మొదటి ఫేజ్లో భాగంగా ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పెట్రోల్ బంక్ వరకు డివైడర్తో రహదారి విస్తరణ జరపడానికి మంత్రి సారథి ప్రభుత్వాన్ని ఒప్పించారు.
మొఘల్ చెరువు సుందరీకరణకు చర్యలు
ప్రస్తుతం జరుగుతున్న రహదారి విస్తరణ పక్కనే ఉన్న మొగల్ చెరువులోకి పట్టణంలోని ప్రధాన డ్రెయిన్ల నుంచి మురుగునీరు చేరు తోంది. ఈ రహదారి విస్తరణలో భాగంగానే ఈ చెరువు కట్టను బలపరిచి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాల్సి వుంది. చెరువులోని మురుగునీరు వల్ల దుర్గంధం వ్యాపిస్తోంది. దీని నివారణకు ఈ చెరువులో కలిసే ప్రధాన ఓపెన్ డ్రెయిన్లను చెరువు వద్ద అనుసంధానం చేసి అక్కడ నుంచి పైప్లైన్ ద్వారా నూజివీడులోని పోతిరెడ్డిపల్లికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న డ్రెయిన్కు మళ్లిస్తే చెరువు చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది.