అధికారులకు మోకాలడ్డు!
ABN , Publish Date - May 26 , 2026 | 12:21 AM
ఏలూరు కార్పొరేషన్ పరిపాలన నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ప్రజాధనం మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేయడానికి ఇక్కడ ఇన్చార్జి అఽధికారులనే వాడుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
నెలాఖరున ఉద్యోగ విరమణ
కొత్త ఎస్ఈగా వెంకటరామిరెడ్డి
ఈఈపై మమకారం ఎందుకో..?
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
ఏలూరు కార్పొరేషన్ పరిపాలన నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ప్రజాధనం మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేయడానికి ఇక్కడ ఇన్చార్జి అఽధికారులనే వాడుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మూడు నెలల క్రితం సూపరింటెండెంట్ ఇంజనీర్గా జి.నాగమోహన్ బదిలీపై రాగా ఆయనను చేర్చుకొని సెలవుపై పంపేసినట్టు సమాచారం. ఈయన ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆ స్థానంలో చిత్తూరు కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తు న్న బి.వెంకటరామిరెడ్డికి ఎస్ఈగా పదోన్నతి కల్పించారు. నాగమోహ న్ రిటైరయ్యాక విధుల్లో చేరాల్సి ఉండగా ఈయననైనా చేర్చుకుంటా రా ? అన్న సందేహం నెలకొంది. కార్పొరేషన్ ఈఈగా సురేంద్రబాబు రెండేళ్ల నుంచి చేస్తూ ఎస్ఈగా చెలామణి అవుతున్నారు. 2022లో కర్నూలులో ఈఈగా పనిచేస్తూ అక్కడ ఎస్ఈ (పూర్తి అదనపు బాధ్యతలు)గా నిర్వహించారు. అమృత్ పనుల బిల్లుల మంజూరులో కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి సస్పెండ్ అయ్యారు. ఆపై ఇక్కడకు బదిలీపై వచ్చి ఎస్ఈగా పూర్తి అదనపు బాధ్యతలతో విధులు నిర్వహిస్తుండడం గమనార్హం.