నామినేటెడ్పై ఆశలు..
ABN , Publish Date - Mar 16 , 2026 | 01:33 AM
ఉగాది నాటికి నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తానని సీఎం చంద్రబాబు ఇటీవల చేసిన ప్రకటనతో జిల్లాలోని సీనియర్ నేతల్లో ఆశలు చిగురించాయి.
పరాభవనామ ఉగాది తెలుగు తమ్ముళ్లకు కలిసొచ్చేనా ?
డజనుకు పైనే కీలక నేతలు ఎదురుచూపులు
ఉగాది నాటికి నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తానని సీఎం చంద్రబాబు ఇటీవల చేసిన ప్రకటనతో జిల్లాలోని సీనియర్ నేతల్లో ఆశలు చిగురించాయి. సంక్రాంతికి నామినేటెడ్ పదవులు అందుతాయని గంపెడాశతో ఎదురు చూశారు.తీరా అది జరగలేదు. ఇప్పుడు కూడా కొత్త సంవత్సరాది పరాభవనామ సంవత్సరం అయినా తమ అనుభవానికి తగిన గుర్తింపు ఇస్తారా? అంటూ ఎదురు చూస్తున్నారు ఈ ఉగాది తెలుగు తమ్ముళ్లకు జోష్ నింపుతుందో? నిరుత్సాహాన్ని ప్రోది చేస్తుందోనన్న సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ రేగుతోంది.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
ప్రతి ఎన్నికల్లో పార్టీ జెండా మోసి పలుమార్లు అధికారంలోకి తీసుకువచ్చాం.. మమ్మల్ని కూడా పట్టించుకోడంటూ తెలుగుదేశంలో సీనియర్లు బయ టకు చెప్పుకోలేక తీవ్ర నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతు న్నారు. ఏదో ఒక నామినేటేడ్ పదవి వస్తుందని ఆశిం చారు. తీరా రెండోఏడు పూర్తవుతున్నా ఇంకా పదవుల పందెరంలో వారికి తగిన గుర్తింపు లభించకపోవడం తో తీవ్ర నిరాశలో ఉన్నారు. టీడీపీలో ఏమి జరుగు తుందో? మాకు గుర్తింపు ఎప్పుడు అంటూ మదన పడే నాయకుల జాబితా పెరిగిపోతోంది. ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఎలానో లేనే లేవు. కనీసం నామినేటెడ్తో సరిపెట్టుకుం దామని ఆశించిన సీనియర్లకు నిరాశే మిగులుతోంది. మిగిలిన మూడేళ్ల కాలంలోనైనా మాకు సేవ చేసే అవకాశం కల్పించా లంటూ వారు కోరుకుంటున్నారు.
ఆ మూడు మినహా.. నాలుగింటిలోనే ఆశలు
జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోను ఏలూరు, ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాల నుంచి చెప్పుకోదగ్గ నామినేటేడ్ పదవులను టీడీపీ నేతలకు కట్టబెట్టారు. ప్రధానంగా చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లోను ఎక్కువమంది పదవులను ఆశిస్తు న్నారు. లింగపాలెం నుంచి మాజీ జడ్పీటీసీ గుత్తా సత్యసాయి వరప్రసాద్ (పెదబాబు) చింతలపూడి ఏఎంసీ పదవిని ఆశించి భంగపడ్డారు. వేరే పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. జంగారెడ్డి గూడెం మండలం నుంచి చింతలపూడి నియోజకవర్గ మాజీ కన్వీనర్ మండవ లక్ష్మణరావు, మైనార్టీ నాయకులు షేక్ ముస్తఫా, టీడీపీ రాష్ట్ర అఽధికార ప్రతినిధి దాసరి శ్యామ్చంద్ర శేషు, తెలుగు యువత మాజీ అధ్యక్షుడు పెనుమర్తి రామ్కుమార్, మాజీ సొసైటీ అధ్యక్షుడు పరిమి సత్యనారాయణ (సత్తిపండు), జిల్లా తెలుగు రైతు మాజీ అధ్యక్షుడు అబ్బిన దత్తాత్రేయలు ఆశిస్తున్నారు. మహిళా నేతలు పగడం సౌభాగ్యవతి గుళ్లపూడి శ్రీదేవి ఆశిస్తున్నారు. పోలవరం నియోజకవర్గంలో సొసైటీలపరంగా టీడీపీ, జనసేనలు మంచి గుర్తింపు ఇచ్చారు. కొయ్యలగూడెం నుంచి తెలుగు మహిళా అఽధ్యక్షురాలిగా రెండుసార్లు పనిచేసిన గంగిరెడ్ల మేఘలాదేవి నామినేటేడ్ పదవిని ఆశిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో మంచి పదవి వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. నూజివీడులో మాజీ ఎమ్మెల్యే ముదరబోయిన వెంకటేశ్వరరావు చాలాకాలం నుంచి చంద్రబాబునే నమ్ముకున్నారు. కైకలూరు నియోజకవర్గంలో కలిదిండి ఏఎంసీ పాలకవర్గం ప్రకటన పెండింగ్లోనే ఉంది. పోకల జోగిరాజు చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. కైకలూరులోని శ్యామలాంబ ఆలయం, రామలింగేశ్వరస్వామి, మీసాల వెంకటేశ్వరస్వామి ఆలయ ట్రస్టుబోర్డుల నియామకం జరగలేదు. దీని కోసం ఎదురు చూస్తున్నారు.
ఎవరి కోటాలో వస్తాయో ?
ప్రధానంగా జిల్లాస్థాయిలో పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్, పోలవరం డెవలప్మెంట్ బోర్డు తదితర పోస్టులు భర్తీ జరగాల్సి ఉంది. అయితే సీనియర్లకు నామినేటేడ్ పోస్టులు ఇవ్వాలన్న చంద్రబాబు దృష్టిలో ఉన్నవారికే న్యాయం జరుగుతుంది. యూత్కు ఎక్కువ ప్రాఽధాన్యం ఇవ్వాలని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భావిస్తున్నారు. దీంతో ఎవర్ని ప్రసన్నం చేసుకోవాలో అర్థంకాని డైలమాలో సీనియర్లు, యువ నేతలున్నారు. మేము కష్టపడ్డాం.. పదవులు కావాలంటూ నేతలు అంటున్నారు. మాకు గుర్తింపు ఇప్పుడు ఇవ్వకపోతే.. ఇకముందు రాదన్న యోచనలో సీనియర్లు కొట్టుమిట్టాడుతున్నారు.