అక్రమార్కులకు అమరవరం..!
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:53 AM
అమరవరం అటవీ రేంజ్ అక్రమార్కులకు వరంగా మారింది. మారుజాతి కలపను సైజులుగా కోసి సరిహద్దు దాటిస్తున్నారు.
కుక్కునూరు, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): అమరవరం అటవీ రేంజ్ అక్రమార్కులకు వరంగా మారింది. మారుజాతి కలపను సైజులుగా కోసి సరిహద్దు దాటిస్తున్నారు. అమరవరం రేంజ్లో అటవీ శాఖాధికారిగా ఏలూరుకు చెందిన ఓ అధికారి ఇన్ఛార్జ్గా విధులు నిర్వహించడంతో పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కొరవడింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అటవీ రేంజ్ అక్రమాలకు అడ్డాగా మారింది. జామాయిల్ నర్సరీలోని కర్రను అక్రమంగా నరికి ఎటువంటి అనుమతులు లేకుండా కలపను తరలిస్తున్నారు. వాల్టా చట్టం నిబంధనలు అతిక్రమించి మారు జాతి కలపను అక్రమంగా రవాణా చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే జామాయిల్ నర్సరీ ఏర్పాటుకు రిజర్వ్ ఫారెస్ట్ భూములు అక్రమించుకు న్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. జిల్లాస్థాయి అధికారుల పూర్తి స్థాయి పర్యవేక్షణ లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. శనివారం అంబోతులగూడెం సమీపంలో వేప,
తుమ్మ చెట్లను స్మగ్లర్లు పట్టపగలే నరికి తరలిస్తున్న విషయం బయటపడింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఈ అమరవరం అటవీ రేంజ్పై దృష్టి పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు