సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:42 AM
ఆది నుంచి ఉన్నది సనాతన ధర్మమేనని దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని చిలకలూరిపేట ఆదిపరాశక్తి క్షేత్ర పీఠాధిపతి నిత్య విద్యానంద భారతి స్వామీజీ అన్నారు.
అత్తిలి, జూన్ 9 (ఆంధ్రజ్యోతి) : ఆది నుంచి ఉన్నది సనాతన ధర్మమేనని దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని చిలకలూరిపేట ఆదిపరాశక్తి క్షేత్ర పీఠాధిపతి నిత్య విద్యానంద భారతి స్వామీజీ అన్నారు. మంగళవారం అత్తిలి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో హనుమాన్ శక్తి జాగరణ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులై పనిచేయాలన్నారు. సనాతన ధర్మాన్ని నిరోధించడానికి జరుగుతున్న దండయాత్రలను ఎదుర్కో వాలన్నారు. అనంతరం ఆర్ఎస్ఎస్ ఆంధ్ర ప్రాంత ప్రచార ప్రముఖ్ భయే వాసు మాట్లాడారు. హనుమాన్ శోభాయాత్ర అత్తిలి డిగ్రీ కళాశాల నుంచి యాత్ర ప్రారంభమై కాలువ గట్టు, గోపాలస్వామి గుడి వీధి, శివాలయం రోడ్డు, తణుకు రోడ్డు మీదుగా రైల్వే స్టేషన్ రోడ్డు రామాలయం వరకు చేరుకుంది. కోలాట భజనలు, తీన్మార్ డప్పులు, హనుమంతుని వేషధారణలు, డ్యాన్స్ అకాడమీ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్, అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు, నల్లూరు సురేష్, ఆల్తి సత్యనారాయణ, డీవీ రమణమూర్తి, పోలిశెట్టి గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.