కొనసాగుతున్న గాలింపు
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:27 AM
అయితంపూడి – ఓగిడి మార్గంలో కాలువలోకి కారు దూసుకెళ్లిన విషాద ఘటనలో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి.
దొరకని విద్యార్థి రాజారామ్ చరణ్ ఆచూకీ
అయితంపూడి నుంచి పాలకొల్లు వరకు గాలింపు
ఇరగవరం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): అయితంపూడి – ఓగిడి మార్గంలో కాలువలోకి కారు దూసుకెళ్లిన విషాద ఘటనలో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. కారులో ప్రయా ణిస్తున్న ఇంటర్ విద్యార్థి చెరుకూరి రాజారామ్చరణ్ ఆచూకీ మాత్రం ఇప్పటివరకు లభించ లేదు. సోమవారం ఉదయం నుంచి రెవెన్యూ అధికారులు, పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితంపూడి నుంచి విస్తృతంగా పాలకొల్లు వరకు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. కుమారుడి జాడ తెలియపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మా కొడుకు ఏమయ్యాడో..? ఎక్కడ ఉన్నాడో ? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
మలుపు వద్ద రైలింగ్కు ఏర్పాట్లు
ఈ ప్రమాద ఘటనతో అధికారులు అప్రమత్తమై భద్రతా చర్యలు చేపట్టారు. రైలింగ్ ఏర్పాటుకు సన్నద్ధమయ్యారు. రెవెన్యూ, రవాణా, ఇరిగేషన్, పోలీసు సిబ్బంది సోమవారం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. రాత్రి వేళల్లో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించేలా అవసరమైన హెచ్చరికలు, రక్షణ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రమాద స్ధలాన్ని తాడేపల్లిగూడెం డీఎస్పీ రవిచంద్ర, తణుకు రూరల్ సీఐ వెంకటేశ్వరరావు, ఇరగవరం ఎస్ఐ నసీరుల్లా, తహసీల్దార్ సుందర్రాజు, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఆర్అండ్బీ అధికారులు పరిశీలించారు.