మూడే ట్రాక్టర్లు.. 30 టన్నుల చెత్త
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:38 AM
పురపాలకంలో చెత్త సేకరించే ట్రాక్టర్లు షెడ్కు చేరాయి. నెలలు గడుస్తున్నా వాటిని రిపేర్ చేయడం లేదు.
నరసాపురంలో పేరుకుపోతున్న కుప్పలు
ఐదు ట్రాక్టర్లు, రెండు లారీలు షెడ్డులో..
రెండు అద్దె ట్రాక్టర్లతో చెత్త సేకరణ
నెలకు వేలల్లో అద్దె చెల్లింపు
నరసాపురం, జూలై 6 (ఆంధ్రజ్యోతి): పురపాలకంలో చెత్త సేకరించే ట్రాక్టర్లు షెడ్కు చేరాయి. నెలలు గడుస్తున్నా వాటిని రిపేర్ చేయడం లేదు. అద్దె ట్రాక్టర్లతో చెత్త సేకరణ చేపట్టారు. వీటికి వేలాది రూపాయలు అద్దె కడుతున్నారు. పూర్తి స్థాయిలో ట్రాక్టర్లు లేకపోవడంతో వార్డుల్లో సగం చెత్త కూడా సేకరించడం లేదు. మరమ్మతులకు టెండర్లు ఖరారు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో చాలా వీధుల్లో చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి.
పట్టణ పరిధిలో 31 వార్డులు ఉన్నాయి. రోజుకు 35 టన్నుల చెత్త వస్తుంది. పురపాలక శానిటరీ సిబ్బంది ఆరు ట్రాక్టర్లు, రెండు కాంప్రెక్స్ లారీలతో వీటిని సేకరించి డపింగ్ యార్డుకు తరలిస్తుంటారు. గతేడాది నాలుగు ట్రాక్టర్లు రిపేర్కు వచ్చాయి. వీటిని రిపేర్ చేయించేందుకు ప్రతిపాదనలు తయారు చేసి అప్పటి కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే కౌన్సిల్ ఆమోదించలేదు. దీంతో పనులు పెండింగ్ పడ్డాయి. ఈమధ్య కాలంలో మరో రెండు ట్రాక్టర్లు, రెండు లారీలు షెడ్కు చేరాయి. దీంతో చెత్త సేకరించే వాహనాలను రిపేర్ చేసేందుకు షెడ్కు తీసు కెళ్లారు. వీటిలో నాలుగు ట్రాక్టర్లు పాలకొల్లులో ఉండగా రెండు లారీలు రామచంద్రపురం షెడ్లో ఉన్నాయి. ప్రస్తుతం ఒక ట్రాక్టర్ రిపేర్ చేయించారు. మరో రెండు ట్రాక్టర్లను అద్దెకు తీసుకున్నారు. వీటికి ఒక్కోదానికి నెలకు రూ.51 వేలు చొప్పున అద్దె చెల్లిస్తున్నారు.
వార్డుల్లో చెత్త కుప్పలు..
గతంలో ఆరు ట్రాక్టర్లు, రెండు లారీలతో చెత్తను సేకరించినా చాలా వార్డుల్లో సగం చెత్త మిగిలేది. ప్రస్తుతం అద్దె ట్రాక్టర్లు రెండు కలిపి మూడు ట్రాక్టర్లతో మాత్రమే 31 వార్డుల్లోని చెత్త సేకరిస్తు న్నారు. దీంతో చెత్త పేరు కుపోతోంది. రిపేర్కు వచ్చిన ట్రాక్టర్లను బాగు చేయించకుండా కాల యాపన చేస్తున్నారు. మరమ్మతులకు సుమారు రూ.17 లక్షలతో టెండర్లు పిలిచారు. వీటిని ఖరారు చేయకపోవడంతో షెడ్డుల్లోనే ఉండిపోయాయి. దీనిపై డీఈ ప్రసాద్ను వివ రణ కోరగా.. టెండర్లను ఖరారు చేశాం.. త్వరలో కాంట్రాక్టర్కు వర్క్ ఆర్డర్ ఇచ్చి పనులు చేపడతామన్నారు.