సచివాలయాల పేరు మార్చరా?
ABN , Publish Date - May 18 , 2026 | 12:11 AM
గ్రామ సచివాలయాలను స్వర్ణ గ్రామంగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఉత్తుర్వులు ఇచ్చినా, ఇంకా సచివాలయాలుగానే కొనసాగుతుండడంతో క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొంది.
సచివాలయ పేరు మార్పు కాగితాలకే పరిమితం
ఉత్తర్వులు ఇచ్చి మూడు నెలలు అవుతున్న చర్యలు శూన్యం
క్షేత్రస్థాయిలో గందరగోళం
ఏలూరు రూరల్, మే 17(ఆంధ్రజ్యోతి): గ్రామ సచివాలయాలను స్వర్ణ గ్రామంగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఉత్తుర్వులు ఇచ్చినా, ఇంకా సచివాలయాలుగానే కొనసాగుతుండడంతో క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొంది. కార్యాలయాలపై ఇప్పటి వరకు సచివాల యాల పేరు మార్చలేదు. అధికారులు మాత్రం స్వర్ణ గ్రామంగా కాగితాల్లో మాత్రమే చూపిస్తు న్నారు. వైసీపీ హయాంలో అట్టహాసంగా పంచా యతీలను గ్రామ సచివాలయాలుగా మార్చి అవస రానికి మించి సిబ్బందిని నియమించి వారిని ఖాళీగా కూర్చోబెట్టి వేతనాలు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయాల వ్యవ స్థను క్రమబద్ధ్దీకరించే క్రమంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే పంచాయ తీల్లో జనాభా, ఆదాయం, ఇతర అంశాల ఆధా రంగా ఆ సచివాలయాల్లో ఎంత మంది సిబ్బంది అవసరమో అంత మందిని మాత్రమే ఉంచి, అదనంగా ఉన్న సిబ్బందిని ఇతర శాఖలకు సర్దు బాటు కింద పంపించింది. ఈ ప్రక్రియ చేపట్టి సచివాలయాల్లో మిగులు సిబ్బందిని ఇతర శాఖ లకు కేటాయింపు పూర్తి చేసింది. సచివాలయాల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా మండలస్థాయి అధి కారిని నియమించింది. ఇంత వరకు బాగానే ఉన్నా పేరు మార్పు విషయంలో గందరగోళం నెలకొంది.
కాగితాల్లోనే పేరు మార్పు
జిల్లాలో 605 సచివాలయాలు ఉన్నాయి. గ్రామ సచివాలయాన్ని స్వర్ణ పంచాయతీగా, పెద్ద పంచాయతీల్లో వార్డు సచివాలయాలను స్వర్ణ వార్డుగా మార్పు చేయాల్సి ఉంది. ఈ ఆదేశాలు వచ్చి మూడు నెలలు అవుతున్నా క్షేత్రస్థాయిలో కనీసం కార్యాలయాలపై పేరు మార్చలేదు. ప్రజల దృష్టిలో ఇంకా సచివాలయాలుగా కొనసాగుతుండగా, అధికారులు మాత్రం స్వర్ణ గ్రామంగా కాగితాల్లో నడిపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సచివాలయాల పేరు మార్పు చేసి గందరగోళానికి తెరదించాలని పలువురు కోరుతున్నారు.