ట్రాఫిక్ ఆపి మరీ రోడ్డేయాలా ?
ABN , Publish Date - Mar 05 , 2026 | 12:19 AM
తాడేపల్లిగూడెంలో మెయిన్ రోడ్ నిర్మాణం కోసం ఆర్అండ్బీ అధికారులు మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఎంతో రద్దీగా ఉండే ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ ఆపేశారు.
తాడేపల్లిగూడెం రూరల్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): అసలే ఎండలు మండుతున్నాయి. ఆపై మిట్ట మధ్యాహ్నం.. ఈ సమయంలో ట్రాఫిక్ ఆపి మరీ రోడ్డేయాలా..? అంటూ జనం అసహనం వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెంలో మెయిన్ రోడ్ నిర్మాణం కోసం ఆర్అండ్బీ అధికారులు మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఎంతో రద్దీగా ఉండే ఫ్లై ఓవర్ వద్ద ట్రాఫిక్ ఆపేశారు. పోలీసులు, అర్అండ్బీ అధికారులు సమన్వయంతో ట్రాఫిక్ను మల్లించి నిర్మాణం చేపట్టాల్సి ఉండగా నిర్లక్ష్యం వహించారు. మండు టెండలో ఉండలేక ప్రయాణికులు స్టాపర్లను తోసుకుని రోడ్డు నిర్మాణ ప్రాంతానికి దూసుకెళ్లారు. దీంతో పనుల్లో అంతరాయం ఏర్పడింది. ప్రణాళిక లేకుండా తమను ఇబ్బంది పెట్టడంపై వాహన చోదకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆర్అండ్బీ ఏఈ రవి కుమార్ను వివరణ కోరగా పోలీసులసు సమాచారం ఇచ్చామని సిబ్బంది లేరని చెప్పడంతో చేసేదేమీ లేక పనులు మొదలు పెట్టాల్సి వచ్చిందని తెలిపారు.