పదోన్నతులకు రైట్ రైట్
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:24 AM
ఆర్టీసీ ఉద్యోగు లకు పదోన్నతులు కల్పించాలని దాదాపు ఆరేళ్ల తర్వాత ప్రభు త్వం నిర్ణయించింది.
ఆరేళ్ల తర్వాత ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు190 మందికి అవకాశం
భీమవరం టౌన్, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి):ఆర్టీసీ ఉద్యోగు లకు పదోన్నతులు కల్పించాలని దాదాపు ఆరేళ్ల తర్వాత ప్రభు త్వం నిర్ణయించింది. దీనిపై ఉత్తర్వులు జారీ కావడంతో సంబంధిత ఉద్యోగులు ఆయా డిపోలకు వెళ్లి ఉద్యోగ బాధ్యతల్లో చేరుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎనిమిది డిపోల్లో దాదాపు 190 మందికి పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతలు 2019 తర్వాత రావాల్సి వుంది. అయితే కొంత మంది కోర్టుకు వెళ్లడంతో ఆలస్యం జరిగింది. ఇప్పుడు కోర్డు ఉత్తర్వులను అనుసరించి పదోన్నతులు ఇచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, కొవ్వురు, భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం డిపోలు ఉన్నాయి. ఇందులో పలువురు కండక్టర్లకు, డ్రైవర్లకు కలిపి ఏడీసీలుగా 72 మందికి, డిపో కర్ల్క్ల కింద 18 మందికి, మెకానికల్ విభాగంలో 15 మంది మెకానిక్లకు గ్రేడ్–2 నుంచి గ్రేడ్– 1గాను, టైర్ సెక్షన్ విభాగంలో ఐదుగురికి, వెల్డర్ విభాగంలో ఒకరికి, బ్లాక్ స్మిత్ విభాగంలో ఇద్దరికి, హేమర్ మెకానిక్స్ విభాగంలో ఇద్దరికి, హెల్పర్ విభాగంలో 10 మందికి పదోన్నతి కల్పిస్తూ ప్యానల్ను సిద్ధం చేశారు. త్వరలో డిపోల వారీగా ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. డ్రైవర్స్ విభాగంలో గ్రేడ్–2 డ్రైవర్ల నుంచి గ్రేడ్–1 డ్రైవర్లుగా 84 మందికి పదోన్నతి కల్పించారు. వీరు ఏ డిపోలో పనిచేస్తున్నారో అక్కడే విధులు నిర్వహిస్తారు. వీరికి వచ్చే పదోన్నతి ప్రతి ఫలాలను అందిస్తారు. ఉత్తర్వులు అందుకున్న వారు సంబంధిత డిపోల్లో బాధ్యతలు చేపట్టారు.
టిమ్లకు పవర్ బ్యాంక్లు
చార్జింగ్ కోసం 440 మంది కండక్టర్లకు అందజేత
భీమవరం టౌన్, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి):ఆర్టీసీ బస్సులో టిక్కెట్ ఇష్యూ మిషన్(టిమ్)లకు చార్జింగ్కు అవసరమైన పవర్ బ్యాంక్లను ఆర్టీసీ అధికారులు కండక్టర్లకు అందజేస్తు న్నారు. స్త్రీ శక్తి మహిళల ఉచిత బస్సు ప్రయాణంతో టికెట్ల జారీ మిషన్ల వినియోగం పెరిగింది. ఫలితంగా ఎక్కువ సేపు చార్జింగ్ నిలబడడం లేదు. దీనిపై కండక్టర్లు ఆందోళన చెంద డంతో ఆర్టీసీ యాజమాన్యం ప్రతీ కండక్టర్కు పవర్ బ్యాంక్ను అందించింది. దీంతో టిమ్ చార్జింగ్ సమస్య తీరినట్లే. గతంలో ఒకసారి టిమ్ చార్జింగ్ పెట్టి డ్యూటీకి వెళ్లి వచ్చే వరకు సరిపోయేది. ఇప్పుడు మహిళలకు టిక్కెట్లు ఇచ్చే సమయం పెరగడంతో చార్జింగ్ నిలబడడం లేదు. ఈ నేపథ్యంలో 22.5 వాట్స్ పాస్ట్ చార్జింగ్ కలిగిన పవర్ బ్యాంక్లను భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం డిపోల్లోని 440 మంది కండక్టర్లకు అందించారు. ఇంటి వద్ద చార్జ్జింగ్ పెట్టుకుంటే డ్యూటీ దిగే వరకు సరిపోతుంది.
ఇప్పటి వరకు టిమ్లో నెట్ను నిలుపుదల చేయడంతో పల్లె వెలుగు బస్సుల సమాచారం తెలిసేది కాదు. జీపీఎస్ లేక పోవడంతో అది ఎక్కడ వుంది ? ఎప్పుడు వస్తుంది ? మొద లైన విషయాల్లో అధికారులు ఇబ్బంది పడేవారు. ఇప్పుడు పవర్ బ్యాంక్ ఇవ్వడం వల్ల చార్జింగ్కు ఇబ్బంది ఉండదని, టిమ్లో నెట్ను ఆన్ చేయడం వల్ల జీపీఎస్ అందుబాటులోకి రానుంది. ఇక నుంచి పల్లె వెలుగు బస్సు ఎక్కడ ఉందనే సమాచారం అందుబాటులో ఉంటుంది.