రియల్ జోష్
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:15 AM
జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కాస్త ఆశాజనకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రెండు నెలలుగా పెరిగిన రిజిస్ర్టేషన్లు
ఈ ఏడాది లక్ష్యానికి మించి ఆదాయం
గత ఏడాదికంటే రూ.100 కోట్లు పెరిగే ఛాన్స్
ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న
భూముల మార్కెట్ విలువ
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కాస్త ఆశాజనకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు నెలల నుంచి రిజిస్ర్టేషన్ ఆదాయం పెరిగింది. లక్ష్యానికి మించింది. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ పెరగనుంది. ఈలోగా రిజిస్ర్టేషన్లు చేయించుకునేందుకు కొనుగోలుదారులు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలకు పోటెత్తుతున్నారు. రిజిస్ర్టేషన్లు జోరందుకున్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఏటా జనవరి నుంచి మార్చి మాసాంతం వరకు ఆర్థిక లావాదేవీలు ముగించుకునే పరి స్థితి ఉంటుంది. పంటలు చేతికొస్తాయి. అందరి వద్ద సొమ్ములుంటాయి. ఈ కారణంగా భూము ల కొనుగోళ్లు అమ్మకాలతో రిజిస్ర్టేషన్లు ఎక్కు వగా జరుగుతాయి. ఈ ఏడాది జిల్లాలో రెండు నెలల నుంచే లక్ష్యానికి మించి ఆదాయం సమ కూరుతోంది. రిజిస్ర్టేషన్ల సంఖ్య పెరిగింది. పట్ట ణాల పరిధిలో స్థలాల క్రయ, విక్రయాలు మెల ్లగా ఊపందుకుంటున్నాయి. రియల్టర్లు పోటీ పడుతూ మౌలిక వసతులు కల్పిస్తున్నారు. సీసీ రహదారులు, డ్రెయిన్లు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు లే అవుట్లకు అనుమతులు పొందు తున్నారు. అటువంటి చోట్ల స్థలాల విక్రయం పెరగడంతో రిజిస్ర్టేషన్ శాఖలో జోష్ నింపింది.
ఆదాయం ఇలా..
జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.467.11 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా ఇచ్చారు. ఇప్పటి వరకు రూ.428.54 కోట్లు వచ్చేసింది. ఇది ఈ నెల 20 నాటికి రిజిస్ర్టేషన్ శాఖ తేల్చిన లెక్కలు. గత ఏడాది జిల్లాలో ఇదే తేదీకి రూ. 346.55 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది ఏకంగా రూ.81 కోట్ల మేర ఆదాయం పెరిగింది. జిల్లాలో 74,664 రిజిస్ర్టేషన్లు జరిగాయి. కొంద రు ముందస్తుగానే చలానాలు తీసుకున్నారు. ఆ ఆదాయాన్ని ఇంకా లెక్కించలేదు. వారం రోజు ల్లో మరో రూ.12 కోట్ల ఆదాయం వచ్చి ఉంటుం ది. జనవరి మాసాంతానికి రూ.100 కోట్ల మేర ఆదాయంతో జిల్లా మెరుగైన స్థానంలో ఉండ నుంది. రెండు నెలలపాటు రిజిస్ర్టేషన్లు అధికం గా ఉంటాయని అంచనా.
కొత్త ధరల్లో దిద్దుబాటు
రిజిస్ర్టేషన్ శాఖ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వ్యవసాయ భూములతోపాటు, స్థలాల ధరలు కాస్త పెరుగుతున్నాయి. కొన్నిచోట్ల అత్యధికంగా ధరలు పెరిగాయి. వ్యవసాయ భూములున్న చోట గజాల రూపంలోకి మార్చేశారు. మరోవైపు ఎకరం ధర రూ.4 కోట్ల వరకు ప్రతిపాదనల్లో చేరిపోయింది. తాడేపల్లిగూడెం, భీమవరం వంటి ప్రాంతాల్లో ఇటువంటి తప్పులు దొర్లాయి. వాటిని సరిదిద్దాలని కలెక్టర్ నాగరాణి ఆదేశాలు జారీచేశారు. పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్, గ్రామీణ ప్రాంతాల్లో తహశీల్దార్తోపాటు, సబ్ రిజిస్టార్లు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. తుది ప్రతిపాదనలు ఆమోదానికి సమాయత్తం అవుతున్నారు. కొత్త ధరలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి రానుండడంతో సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో అధికారులకు ఊపిరి సలపనంతగా రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయి. జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో రానున్న రెండు రోజుల్లో రూ.4 కోట్లు మేర ఆదాయం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
స్లాట్లతో పారదర్శకత
ప్రభుత్వం రిజిస్ర్టేషన్ల కోసం స్లాట్లు అమలు లోకి తెచ్చింది. కొత్త విధానంతో రిజిస్ర్టేషన్కు వచ్చే వారిలో పారదర్శకత ఏర్పడింది. ముందు గానే స్లాట్లు బుక్ చేసుకుంటున్నారు. తాజాగా జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలకు స్లాట్ల సంఖ్యను పెంచారు. రద్దీగా ఉండే కార్యా లయాల్లో ప్రతి రోజు 117 స్లాట్లు, ఇతర కార్యా లయాలకు 78 వంతున స్లాట్లు కేటాయిం చారు. ఫలితంగా రిజిస్ర్టేషన్లు పెరుగుతున్నాయి.