Share News

రియల్‌ మోసం!

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:24 AM

వ్యవసాయ భూములను భూమార్పిడి చేయకున్నా, చేసినట్లు చూపుతూ కొంద రు రియల్టర్లు అనధికారికంగా లే–అవుట్లు వేసి అమ్మేస్తున్నారు.

రియల్‌ మోసం!

చోద్యం చూస్తున్న అధికార గణం

ఎల్‌ఎఆర్‌ఎస్‌ కింద రెగ్యులరైజ్‌కు అవకాశం

వ్యవసాయ భూములను భూమార్పిడి చేయకున్నా, చేసినట్లు చూపుతూ కొంద రు రియల్టర్లు అనధికారికంగా లే–అవుట్లు వేసి అమ్మేస్తున్నారు. పంచాయతీలు, ప్రభుత్వ ఖజానాకు లక్షల్లో ఆదాయానికి గండి కొడుతు న్నా అధికారులు చోద్యం చూస్తు న్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొంత మంది రియల్టర్లు ప్రభుత్వ, రెవెన్యూ స్థలాలను ఆక్రమించేసి ప్లాట్లుగా చేసి విక్రయాలు చేసి జేబులు నింపుకుంటున్నారు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

నాన్‌ లే–అవుట్‌ చేసి ప్లాట్లు విక్రయిస్తున్న వారికి జరిమానా విధింపు జరుగుతున్న వారు ఎగ్గొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా పదుల సంఖ్యలో ఇడా పరిధిలోనే ఉంటారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో రియల్టర్లు నుంచి జరిమానా సొమ్ము వసూలు చేయకుండా అధికారులు ఉదాశీన వైఖరి ప్రదర్శిస్తూ పరోక్షంగా మద్దతు పలుకుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏలూరు, భీమవరం, వీరవాసరం, పాలకొల్లు, నర్సాపురం, జంగారెడ్డిగూడెంలో నాన్‌ లే–అవుట్లు వెలుస్తున్నాయి.

భూమార్పిడి లేకుండానే..

గ్రామాల్లో రియల్టర్లు వ్యవసాయ భూము లను భూ మార్పిడి చేయకుండానే వ్యాపారం చేస్తున్నారు. రియల్టర్లు ప్రభుత్వానికి భూ మార్పిడి ఫీజు చెల్లించకుండానే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఇడా) పరిధి లోకి 727 పంచాయతీలు, ఉమ్మడి జిల్లాలోని మునిసిపాలిటీలు ఉన్నాయి. అక్రమ లే– అవుట్‌ లేని పంచాయతీలు, పట్టణాలు ఉండవనే తెలుస్తోంది. ఉదాహరణకు ఒక లే–అవుట్‌ నాలుగు ఎకరాలుంటే ఎకరాకు భూమార్పిడి ఫీజు చెల్లించి మూడు ఎకరాలు భూమిని అక్రమంగా ప్లాట్లుగా చేసి విక్రయి స్తున్నారు. నిబంధనల మేరకు 30 అడుగుల రోడ్డు, 10 శాతం సామాజిక స్థలం పంచా యతీకి దాఖలు చేయాలి. ఈ నిబంధనలు గాలికొదిలేశారు.

మామూళ్లతో సరి

గ్రామాల్లో రెవెన్యూ, మున్సిపాల్టీల్లో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు మామూళ్లతో రియల్టర్లు అనధికారిక లే–అవుట్లను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాన్‌ లే–అవుట్లను గుర్తించిన విజిలెన్స్‌, రెవెన్యూ అధికారులు జరిమానాలు విధించినా, ప్రభుత్వానికి ఆదాయం వసూలు చేయాల్సిన అధికారులు రియల్టర్లు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ల్యాండ్‌ కన్వర్షన్‌ ఫీజుగా ఐదు శాతం ఫీజు కింద చెల్లింపులు చేయాలి. రియల్టర్లు ప్రభుత్వానికి భూ మార్పిడి ఫీజు చెల్లించకుండా పంచాయతీల నుంచి అనుమతి తీసుకోకుండా అనధికారికంగా నివాస, వాణిజ్య అవసరాల కోసం ప్లాట్లుగా విభజించి విక్రయాలు చేపడుతున్న దాఖలాలు కోకొల్లలు.

ఇడా పరిధిలో అనధికారిక లే–అవుట్లు

ఇడా పరిధిలోని అనధికారిక లే–అవుట్లను ఇప్పటికే 500 వరకు గుర్తించారు. వాటిల్లో 300 లే–అవుట్లలో ఎల్‌ఆర్‌ఎస్‌ పఽథకం కింద వాటిని రెగ్యులరైజ్‌ చేశారు. దీనిద్వారా రూ.23 కోట్ల ఆదాయం ఇడాకు జమ అయ్యింది. ఈ నెల 23తో ముగియనున్న ఎల్‌ఆర్‌ఎస్‌ కింద మరో 200 లే–అవుట్లలో ప్లాట్లను క్రమబద్ధీక రించేందుకుకు నోటీసులు జారీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వీటి ద్వారా మరో రూ.20 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు జరిమానాలు విధించేవారని, ఇప్పుడది ఎల్‌ఆర్‌ఎస్‌ పరిధిలో వచ్చిందన్నారు.

Updated Date - Apr 07 , 2026 | 12:24 AM