కోట్లాటకు సై
ABN , Publish Date - Jan 14 , 2026 | 01:12 AM
ఏలూరు జిల్లాలో అతి భారీగా జరిగే పందేల్లో ప్రధానమైనది నూజివీడు మండలం మీర్జాపురం బరి.
మీర్జాపురంలో భారీ బరి
ఏలూరు జిల్లాలో అతి భారీగా జరిగే పందేల్లో ప్రధానమైనది నూజివీడు మండలం మీర్జాపురం బరి. దీనిని పది ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులు, ముఖ్యమైన నేతలతో మూడు రోజులు వేస్తారు. గుండాట, లోన బయట, పేకాటకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మూడు వేల మందికి పైగా సిట్టింగ్ ఏర్పాటు చేశారు. ఎంట్రీ టోకెన్లను సిద్ధం చేశారు. తొలి రోజు నుంచి ఒక్కో పోటీ రూ.25 లక్షలుగా నిర్ణయించారు. రోజుకు 22 పోటీలను నిర్వహించనున్నారు. మొదటిరోజు మొదటి ఆరు పందేలు, రెండు, మూడో రోజుల్లో మొదటి ఆరు పందేలు మొత్తం 18 పందేల్లో ఎవరు ఎక్కువగా గెలుస్తారో వారికి కారు బహుమతిగా ఇవ్వనున్నారు. అదనంగా ముసుగు పందెంలో నాలుగు రెట్లు పందెం పలకనుంది. మొదటి రోజు గుడివాడ ప్రభాకర్, కృష్ణ సిండికేట్ల మధ్య పందేలు జరగనున్నా యి. రెండో రోజు రాత్రి రత్తయ్య, మురళి సిం డికేట్ల మధ్య పోటీలు జరగనున్నాయి. మూడో రోజు షెడ్యుల్ భోగి రోజున ఖరారు కానున్నది. ఈ షెడ్యూల్ ప్రధాన పోటీలకు సంబంధించినది కాగా వీటికి అదనంగా రూ.10, 5 లక్షల పోటీలు జరగనున్నాయి.
హోరాహోరీ బరులు
కొయ్యలగూడెం మండలం రామా నుజపురంలో భారీగా పందేలు జరుగుతాయి. పామాయిల్ తోటలో నాలుగైదు ఎకరాల్లో బరి సిద్ధం చేశారు. రోజుకు కోటికిపైనే చేతులు మారుతుంటాయి. హైదరాబాద్, బెంగళూరుల నుంచి సంపన
కుటుంబాలకు చెందిన మహిళా నేతలు కుటుంబాలతో సహా ఇక్కడకు రానున్నారు.
కుక్కనూరు మండలం వేలేరులో భారీగా ఏర్పాట్లు జరి గాయి. ఇటీవలే ముంపు ప్రాంతాల ప్రజలకు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్ట పరిహారం సొమ్ములు జమయ్యాయి. దీంతో పందేలకు భారీగా వస్తారని అం చనా. ఇక్కడకు తెలంగాణకు చెందిన బూర్గంపాడు, భద్రాచలం పాల్వంచలకు చెందిన నేతలు, రాజకీయ ప్రముఖులతోపాటు, స్థానికులు భారీగా పోటెత్తుతారు.
కైకలూరు రూరల్ మండలం భుజబలపట్నంలో ప్రతీ రోజు రెండు కోట్ల పైబడి చేతుల మారతాయి. ఇక్కడ కైకలూరు–నరసాపురం నేషనల్ హైవే పక్కన భారీ సెట్టింగులతో బరి ఏర్పాటు చేశారు. కనీసంగా రెండు ఎకరాలు సిద్ధం చేశారు. ప్రధానంగా ఆకివీడు, దుంపగడప, ఉండి, కైకలూరు, ఏలూరు, ఏలూరుపాడు, ఐ భీమవరం, కలిదిండి నుంచి పెద్ద ఎత్తున తిలకించడానికి ఇక్కడకు వస్తుంటారు. ప్రధానంగా ఓ సామాజిక వర్గానికి చెందిన వారే ఇక్కడకు ఎక్కువగా రావడం విశేషం.
జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ఐదు ఎకరాలలో బరులకు సిద్ధం చేశారు. పందేలకు తెలంగాణకు ఇక్కడకు వస్తుంటారు. చింతలపూడిలో తెలంగాణ బోర్డర్ సమీపంలోని చింతపల్లి, రాఘవాపురంల్లో మామిడితోటలు, పామాయిల్ తోటల్లోనే భారీగానే జరుగుతాయి. తెలంగాణ బోర్డర్లో 70 శాతంకు పైగా ఓ మోస్తరుగా వస్తారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలో భారీ బరి లో హైటెక్ ఏర్పాట్లు చేశారు. గుండుగొలనులోని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వెంచర్లో టీడీపీ నేత రాజులు బరి ఇది. గుండుగొలనులోనే సెపరేటుగా వైసీపీ హయాంలో ఒక బరి ఏర్పాటు చేశారు. పేకాట, గుండాటలు విచ్చల విడిగా సాగుతుంటాయి. రోజుకు రెండు కోట్లపైనే చేతు లు మారుతుంటాయి. కనీసంగా రూ.10 లక్షల నుంచి 25 లక్షలపైనే ఒక పందెం విలువ ఉంటుంది.
పట్టణాలు.. గ్రామాల్లో మోస్తరుగా..
నూజివీడు టౌన్, రూరల్లో నాలుగు బరులు, చాట్రాయిలో మూడుచోట్ల, ముసునూరు రెండు చోట్ల, ఆగిరిపల్లిలో రెండుచోట్ల బరులు సిద్ధమయ్యాయి. ముది నేపల్లిలో పెదపాలపర్రు, బొమ్మినంపాడులో వరుసగా ఐదు పందేలు గెలిచిన కోడికి కారు బహుమతిని అంది వ్వనున్నారు. అల్లూరులో మూడు చోట్ల లక్షల్లో పందేలు చేతులు మారుతుంటాయి. కలిదిండి మండ లంలో పెద్దబరులు రెండు, చిన్నవి మూడు సిద్ధం చేశారు. రోజుకు పది లక్షలు చేతులు మారుతుంటాయి. కామ వరపుకోటలో రావికంపాడు, తాడిచర్లలో భారీగా పందేలు వేస్తారు. జంగారెడ్డిగూడెం టౌన్లో బైపాస్లో రెండు బరులు సిద్ధమయ్యాయి. నిడమర్రులో తోకలపల్లి, పెదనిండ్రకొలను, బావాయిపాలెం, చానమల్లి చిన్నవి బరులు ఏర్పాటు చేశారు. ఉంగుటూరు నియోజక వర్గంలో చేబ్రోలు, బాదంపూడిల్లో ఓ మోస్తరు బరులు ఏర్పాటు చేశారు. ఇలా రెండు వందలకు పైగా బరులు ఏర్పాటు చేశారు.
కొల్లేరులో మరీ ప్రత్యేకం
కైకలూరు, మండవల్లి, ఏలూరు రూరల్, భీమఢోలు లోని లంక గ్రామాల్లో వడ్డీ కులస్తుల చేతుల్లో పందేలు సాగుతుంటాయి. ఇక్కడ పోలీసులు కాలు మోపరు. అందుకనుగుణంగా వారికి లక్షల్లో ముడుపులు ముట్ట చెబుతారు. శృంగవరప్పాడు, కొట్టాడ, పందిరిపల్లి గూడెం కొల్లేటకోట, భుజబలపట్నం, రాచపట్నం, చటకా య్, మండవల్లి మండలం చింతపాడు, మండవల్లి, బైరవపట్నం, చావలిపాడు ఓ మోస్తరు జరుగుతుం టాయి. ఏలూరు రూరల్ మండలంలో ప్రత్తికోళ్లలంక, పైడిచింతపాడు, గుడివాకలంకలతోపాటు బయట ప్రాంతాలకు దగ్గరగా ఉన్న శ్రీపర్రు, జాలిపూడి, మాదేపల్లిలోనే పందేలు జోరుగా సాగుతుంటాయి.
సకల సౌకర్యాలకు పెన్నిధి
కోడి పందేల నిర్వహణతోపాటు గుండాట, పేకాట లకు అనుమతులు ఇచ్చిన నిర్వాహకులు భారీగా లాభ పడుతుంటారు. దీంతో సౌకర్యాల కల్పనకు భారీగా వ్య యం చేశారు. కౌంటింగ్ మిషన్ల ఏర్పాటు, కోడి పందేల బరి వద్ద గుండాట, పేకాట శిబిరాలు ఏర్పాటు చేశారు. క్లబ్ల్లో ఆడే పేకాటరాయళ్లే ఎక్కువగా ఇక్కడ ఆడు తుంటారు. ఇతరచోట్ల ఆడితే పోలీసుల దాడి ప్రభా వం ఉండనుండటంతో వారు విధిగా ఈ బరుల వద్ద పేకాట కు సై అంటున్నారు. ఓవరాల్గా కోడి పందేల వీక్షకుల కు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. చికెన్, మటన్, థమ్ బిర్యానీలు, ఇతర తినుబండారాలతోపాటు మద్యం సరఫరాకు ఏర్పాట్లు చేశారు.
వాహనాల పార్కింగ్కు సౌకర్యాలు
భారీ బరులు ఏర్పాటు చేసిన చోట్ల కార్లు, ద్విచక్ర వాహనాలు ఎక్కడికక్కడ పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనానికి రూ.100పైనే ఛార్జీలు వసూలు చేయనున్నారు. పొలాల మధ్యలో బరులు ఉండటం వల్ల ఊరి మధ్యలోనే వాహనాల పార్కింగ్లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.