ఈడ్చి కొట్టింది..!
ABN , Publish Date - May 30 , 2026 | 12:51 AM
జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి బలమైన ఈదురుగాలులతో వర్షం కురిసింది. గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్నిచోట్ల రోడ్లపై రాకపోకలకు అంతరాయం కలిగింది.
జిల్లావ్యాప్తంగా ఈదురు గాలులతో భారీ వర్షం
విరిగి పడిన చెట్లు.. విద్యుత్ స్తంభాలు.. నిలిచిన కరెంట్
కోర్సవారిగూడెంలో ఇంటిపై పడిన చెట్టు.. తప్పిన ప్రాణాపాయం
నేలరాలిన మామిడి.. రైతుల ఆవేదన
కలిదిండి/దెందులూరు/ముసునూరు/ బుట్టాయగూడెం/ మం డవల్లి, మే 29(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి బలమైన ఈదురుగాలులతో వర్షం కురిసింది. గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్నిచోట్ల రోడ్లపై రాకపోకలకు అంతరాయం కలిగింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలకు అల్లాడుతున్న జనం వాతావరణం మారడంతో కాస్త ఉపశమనం పొందారు.
కలిదిండి మండలంలో పలు చోట్ల వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. కొండంగి– యడవల్లి ప్రధాన రహ దారిపై చెట్టుకొమ్మ విరిగి పడింది. దెందులూరు మండలం పోతునూరు పంచాయతీ లక్ష్మీపురంలో తాటిచెట్టు పడడంతో మూడు స్తంభాలు పడిపోయాయి. ఉండ్రాజవరంలో విద్యు త్ స్తంభం విరిగి పడడంతో ఉండ్రాజవరం,లక్ష్మీపురం,పోతునూరుల్లో విద్యుత్ సరఫరాకు అంత రాయం కలిగింది. విద్యుత్శాఖ అధికారి శ్రీనివాస్, లైన్మన్, సిబ్బంది అర్ధరాత్రి వర్షం కురుస్తున్నా క్రేన్ సహాయంతో విరిగిన స్తంభాలను తొలగించి యుద్ధ ప్రాతిపదికన కొత్త స్తంభాలను ఏర్పా టు చేసి విద్యుత్ సరఫరాను పున రుద్ధరించారు. ముసునూరు మం డలం గోగులంపాడులో నాలుగు విద్యుత్ స్తం భాలు నేల కొరిగాయి. గోప వరం శివారు పెద్దపాటి వారిగూడెంలో తాటిచెట్లు కూలి రెండు స్తంభాలు ధ్వంస మై విద్యుత్ సరఫరా నిలిచింది. శుక్రవారం ట్రాన్స్కో సిబ్బంది విద్యుత్ లైన్లు పునరుద్ధర ణకు చర్యలు చేప ట్టారు.బుట్టాయగూడెం మండలం కోర్సవారి గూడెం లో కుర్సం ఏసుకు చెందిన పెంకుటిల్లుపై చెట్టు విరిగి పడిం ది. ఈ సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంటిలోనే ఉన్నా అదృష్టవశాత్తూ ప్రాణాపాయం జరగ లేదు. గాలు లకు మామిడి పంట నేలరాలడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. మండవల్లి మండలంలో అయ్యవారి రుద్రవరం, కాను కొల్లు, చెందపాడు గ్రామాల పరిసరాల్లో చెట్లు నేలకొరిగి రహ దారులపై పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యు త్ స్తంభాలు దెబ్బతిని విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షం ఆక్వా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.
ఆక్వా రైతుల ఆందోళన
కలిదిండి : వాతావరణంలో మార్పులతో చెరువుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడి రొయ్యలు మృత్యువాత పడే ప్రమాదం ఉందని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. గురు వారం రాత్రి అకాల వర్షం కురవగా శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండతీవ్రత అధికంగా ఉండడంతో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఏర్పడడంతో ఆక్సిజన్ కొరత నివారణకు ఏరియేటర్లను తిప్పుతున్నారు. మరోవైపు ఎగ్తో ఉన్న చేపలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈదురుగాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగి వైర్లు తెగిపోవడంతో అద్దె జనరేటర్లను ఏర్పాటు చేసుకుని ఏరియేటర్లను తిప్పుతున్నారు. చెరువుల్లో ఆక్సిజన్ కొరత నివారణకు ఆక్సిజన్ ట్యాబ్లెట్లు తగు మోతాదులో వాడాలని మత్స్యశాఖ ఏడీ రవికుమార్ తెలిపారు.