అందుకేనా.. పీవీఎల్ రాజీనామా ?
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:13 AM
పశ్చిమగోదావరి జిల్లాలో కీలకమైన ఉండి నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్చార్జిగా దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా సేవలందించిన పీవీఎల్ నరసింహరాజు పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం పెద అమిరంలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
తనను విభేదించే వ్యక్తికి ఉండి బాధ్యతలు
తాను సూచించిన వారికి చుక్కెదురు
(భీమవరం–ఆధ్రజ్యోతి)
పశ్చిమగోదావరి జిల్లాలో కీలకమైన ఉండి నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్చార్జిగా దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా సేవలందించిన పీవీఎల్ నరసింహరాజు పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం పెద అమిరంలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉండి నియోజకవర్గ సమన్వయ కర్తగా పీవీఎల్ వ్యవహరిస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలపైనాసరే పార్టీలో ఉన్నారు. గతంలో డీసీసీబీ చైర్మన్గానూ వైసీపీ అధిష్ఠానం పీవీఎల్ను నియమించింది. ఉండి సమన్వయకర్తగా కొత్తగా నియమించిన యోగీంద్ర కుమార్ రాజుకు, పీవీఎల్ మధ్య తొలి నుంచి సమన్వయం లేదు. పీవీఎల్కు వ్యతిరేకంగానే నియోజకవర్గ పార్టీలో పనిచేస్తూ వచ్చారు. ఇటీవల జిల్లా ఇన్చార్జి పేర్ని నాని సమావేశమైనప్పుడు పీవీఎల్ ఈ విషయంపై చర్చించినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో నియోజ.కవర్గంలో కేడర్కు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించినట్టు కేడర్లో చర్చ జరుగుతోంది. ఇతర ప్రాంతాలకు, ముఖ్యంగా విదేశాలకు వెళ్లకూడదంటూ షరతు విధించినట్టు తెలుస్తోంది. అప్పుడే వేరొకరిని సమన్వయకర్తగా నియమించాలని అధిష్ఠానం ఒక నిర్ణయానికి వచ్చింది. పీవీఎల్కు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో మరొకరికి సమన్వయకర్తగా నియమిస్తామని అధిష్ఠానం స్పష్టం చేసింది. కలవపూడి ప్రసాద్ రాజును సమన్వయకర్తగా నియమించాలని పీవీఎల్ సిఫారసు చేశారు. అందుకు అధిష్ఠానం కూడా తొలుత అంగీకారం తెలిపింది. ఆ తర్వాతే సమీకరణల్లో మార్పులొచ్చాయి. నిత్యం పీవీఎల్తో విభేధించే యోగీంద్రకుమార్ రాజుకు ఉండి బాధ్యతలు అప్పగించడం ఆయన మనసును గాయపరిచింది. గతంలోనూ ఏఎస్ రాజుకు ఉండి పరిశీలకునిగా బాధ్యతలు అప్పగించినప్పుడు కూడా పార్టీపై తన అసంతృప్తిని బయటపెట్టారు. రాజీనామా చేస్తామంటూ హెచ్చరించారు. అప్పట్లో ముఖ్య నాయకులు బుజ్జగించారు. తాజాగా యోగీం ద్రకు బాధ్యతలు అప్పగించడంతో ఉద్దేశపూర్వకంగానే తనను వ్యతిరేకించే వ్యక్తికి బాధ్యతలు అప్పగించ డంతో వైసీపీకి పీవీఎల్ రాజీనామా చేశారు. పీవీఎల్కు కేడర్తో మంచి అనుబంధం ఉంది. త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న సమయంలో పీవీఎల్ ఈ నిర్ణయం తీసుకోవడంతో కేడర్ కొంత అయోమ యానికి గురవుతున్నారు. ఇప్పటికే భీమవరం నియోజక వర్గంలో వైసీపీ ఎదురీదుతోంది. తాడే పల్లిగూడెంలో నాయకుల మధ్య సమన్వయం లోపించింది. ఇప్పుడు ఆ సరసన ఉండి చేరిపోయింది.
ఆ..ఇద్దరు జిల్లాను నాశనం చేశారు..
పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడు అసెంబ్లీ సీట్లలో ఒక్కటి కూడా వైసీపీ గెలిచే పరిస్థితి లేదని విలేకరుల సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు నాయకులు మొన్న ఐదేళ్లు అధికారంలో ఉండి పదవులను అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించారు. ఇప్పుడు వాళ్ల ఉద్దేశం ఏమిటంటే నిక్కచ్చైనవాడు ఇక్కడ ఉండకూడదు. గ్రంథి శ్రీనును పంపారు. కొట్టు సత్యనారాయణను పంపారు. ఇప్పుడు ఉండిలో నన్ను పంపుతున్నారు.అని ఆరోపించారు.ఎవరైతే డమ్మీలుగా ఉంటారో..వాళ్ళు చెప్పిన మాట వింటారో వాళ్లను పెట్టుకుని పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. ఒకరికేమో అందరూ ఓడిపోవాలి..ఆయనే గెలిచి మినిస్టర్ అయిపోవాలి.మరొకరికి కొడుకును అర్జెంట్గా ఎమ్మెల్యే చేయాలి.. అంటూ పీవీఎల్ ఆ నాయకులపై ఆరోపణలు చేశారు.