ఊరు వెళ్తున్నారా..? జాగ్రత్త!
ABN , Publish Date - Apr 30 , 2026 | 12:44 AM
భానుడి ప్రతాపంతో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయి.
ఊరు వెళ్తున్నారా..? జాగ్రత్త!
ధర పెరుగుదలతో బంగారంపై కన్ను
ఇంట్లో ఉండగానే చోరీలు
అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
ఏలూరు క్రైం, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): భానుడి ప్రతాపంతో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయి. ఆర్థిక స్థోమత ఉన్న వారు ఏసీ రూముల్లో సేద తీరుతారు. చల్లదనం బయటకు పోకుండా తలుపులను గట్టిగా బిగిస్తారు. దీంతో బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు. డాబాపై నిద్రించే వారు తమ ఇళ్ళకు తాళాలు వేసి పైకి వెళ్తారు. ఇదే దొంగలకు కలిసి వస్తోంది.
గాఢ నిద్రలో ఉన్న సమయంలో దొంగలు ఇళ్ళల్లోకి చొరబడుతూ నేరాలు చేస్తున్నారు. ఇళ్ళ తాళాలు పగలగొడుతున్నారు. ఇంట్లో నిద్రిస్తున్నప్పటికీ కిటికీ నుంచి లోపల పెట్టిన గడియలను తీస్తు ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు. తాళాలు వేసి వేసవి కాలం సెలవులకు ఊరు వెళ్తున్నారంటే ఇక ఆ ఇంటి పరిస్థితి గాలిలో దీపం పెట్టినట్టే. సాధారణంగా వేసవిలోనే ఇతర రాష్ట్రాల నుంచి కరుడుగట్టిన నేరస్తులు వస్తూ ఉంటారు. 20 ఏళ్ళుగా జిల్లాలో పరిస్థితులు పరిశీలిస్తే తెలగపాముల ముఠా, చెడ్డీ గ్యాంగ్ ముఠాలు జిల్లాలో చోరీలకు పాల్పడిన వారు ఉన్నారు. ఇటీవలి కాలంలో ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి ప్రాంతాల నుంచి కూడా వచ్చి నేరాలకు పాల్పడ్డారు. గతంలో తెలగపాముల ముఠా జిల్లాలో ప్రవేశించి ఏలూరు, దెందులూరు, పెదవేగి మండలాల్లో నేరాలకు పాల్ప డిన సంఘటనలు ఉన్నాయి. చివరకు ఒక నేరస్తుడు పారిపోతుండగా రాత్రి గస్తీ పోలీసులు జీపుతో వెంటపడ్డారు. చింతలపూడి రోడ్డులో ఉన్న తమ్మిలేరు బ్రిడ్జిపై నుంచి దూకేయడంతో అతని రెండు కాళ్లు విరిగి పోలీసులకు చిక్కాడు. దీంతో తెలగపాముల ముఠాను అరెస్టు చేయగలిగారు.
ఫఏలూరు శాంతినగర్లో ఒక న్యాయవాది సత్యనారాయణ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఒక చేపల వ్యాపారి అదే రోజు రెండు కోట్ల రూపాయల వరకు నగదు తెచ్చి ఇంట్లో పెట్టారు. అదే రోజు అర్ధరాత్రి 1 గంట సమయంలో చెడ్డీగ్యాంగ్ కు చెందిన ఐదుగురు ముఠా సభ్యులు వచ్చి ఇంట్లో మనుషులు ఉండగానే చోరీకి యత్నించారు. అదృష్టవశాత్తు ఆ ఇంటికి సీసీ కెమెరాలు ఉండడంతో బయట అలికిడి వచ్చిందని న్యాయవాది వెంటనే చుట్టు పక్కల వారికి ఫోన్లు చేయడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీ సు సైరన్ వినపడడంతో వారు పారిపోయారు. ఈ సంఘటనపై ఏలూరు త్రి టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినప్పటికీ ఆ గ్యాంగ్ అరెస్టు కాలేదు.
జిల్లాలో జాతీయ రహదారి, రాష్ట్రీయ రహదారు లకు దగ్గరలో ఉన్న గ్రామాలను, పట్టణాలను ఎంపిక చేసుకుంటారు. వారు నేరం చేసిన వెంటనే లారీ ల్లోనూ, మరే ఇతర వాహనాల్లోనూ త్వరగా వెళ్ళిపోవ డానికి ప్రయత్నిస్తుంటారు. జిల్లాలో ఇళ్ళ దొంగత నాలకు పాల్పడే దొంగల ముఠాలు ఎక్కువగానే ఉన్నా యి. అసలే బంగారం రేటు రోజురోజుకూ పెరిగిపో తోంది. వాటిని ఎంత భద్రపర్చుకోవాలన్న భయం భయంగానే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో స్వీయ రక్షణతోనే వస్తువులకు, ఇంటికి భద్రత కల్పించుకోవచ్చని చెప్తున్నారు.
ఈ జాగ్రత్తలు ఎంతో ముఖ్యం
ఊరువెళ్ళేటప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు, బంగారం లేకుండా చూసుకోవాలి. వీలైనంత వరకూ బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలి. ఇంటి కాపలాకి బంధువులను కానీ, తెలిసిన వారిని కానీ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఇళ్ళకు తాళాలు వేసి ఊరు వెళ్ళేవారు సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇస్తే ఎల్హెచ్ఎంఎస్ (లాక్డు హౌస్ మానిటరింగ్ సిస్టమ్) సీసీ కెమెరాను ఇంట్లో ఏర్పాటు చేసి నిఘా పెడతారు. పోలీస్ పెట్రోలింగ్ కూడా నియమిస్తారు. నేడు తక్కువ ధరకు సిమ్ కార్డు ద్వారా పనిచేసే సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటికి తాళాలు వేసి ఊర్లు వెళ్ళే వారు తలుపులు, కిటికీలు పూర్తిగా సురక్షితంగా లాక్ చేసుకోవాలి. ప్రయాణించేటప్పుడు కూడా బంగారు ఆభరణాలు భద్రంగా చూసుకోవాలి. ఇళ్ళ వెంబడి అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే 112కు సమాచారం అందించాలి.
లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంను వినియోగించుకోవాలి
–కె. ప్రతాప్ శివకిషోర్, ఏలూరు జిల్లా ఎస్పీ
లింగపాలెం: నేరాలనును అరికట్టడంలో ‘లాక్డ్హౌస్ మానిటరింగ్ సిస్టం’ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రజలకు పోలీసు శాఖ ఈ సేవను ఉచితంగానే అందిస్తుంది. ఇళ్ల వద్ద కరెంటు పోయిన సమయంలో కూడా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ప్రజలకు ఈ విషయంపై మరింత ఎక్కువగా అవగాహన కల్పిస్తున్నాం. దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలి.