నేడు పోలవరానికి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:31 AM
పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర జల్ శక్తి కార్యదర్శి వీఎల్ కాంతారావు, ప్రాజెక్టు అథారిటీ సీఈవో సంజీవ్ వోహ్రా, సీడబ్ల్యూసీ సభ్యులు యోగేష్ పైథంకర్ బుధవారం రానున్నారు.
నేడు పోలవరానికి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి
పోలవరం, మార్చి 24(ఆంధ్రజ్యోతి):పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర జల్ శక్తి కార్యదర్శి వీఎల్ కాంతారావు, ప్రాజెక్టు అథారిటీ సీఈవో సంజీవ్ వోహ్రా, సీడబ్ల్యూసీ సభ్యులు యోగేష్ పైథంకర్ బుధవారం రానున్నారు. వీరు మంగళ వారం రాజమహేంద్రవరం చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఉదయం పోలవరం ప్రాజెక్టు కార్యాలయానికి చేరుకుని అక్కడ జలవనరుల శాఖ, ఇరిగేషన్ అధికారులు, మేఘా కార్యనిర్వహణ సంస్థ ప్రతినిధులతో మమేకమవుతారు. అనంతరం ప్రాజెక్టు హిల్ వ్యూ ప్రాంతం నుంచి ప్రాజెక్టు ను పరిశీలిస్తారు. ప్రాజెక్టు మోడల్ హౌస్ ప్రాంతాన్ని, స్పిల్వే, ఎగువ కాపర్ డ్యాంలో పూర్తయిన బట్రస్ డ్యాం పనులు, డి హిల్, పవర్ హౌస్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలిస్తారు. డి హిల్ ప్రాంతంలో గ్యాప్ 1 ఎర్త్ కం రాక్ఫిల్ డ్యాం, డయా ఫ్రం వాల్ నిర్మాణ పనుల్ని పరిశీలిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో పనుల పురోగతి, భూసేకరణ, ఆర్అండ్ఆర్ సమస్యలపై సమీక్షిస్తారు. సమీక్ష సమావేశంలో ప్రాజెక్టులో జరుగుతున్న పనుల్లో ఎదురవుతున్న సమస్యలు, నిర్థిష్ట సమయానికి పనులు పూర్తి చేయ డానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికలు, పవర్ జనరేషన్ కార్పో రేషన్ (ఏపీ జెన్కో) అధికారులతో పవర్ హౌస్ నిర్మాణం పనులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రాజెక్టు అతిథి గృహం ఆవరణ బయట స్వచ్చతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతారు. అనంతరం రాజమహేంద్ర వరం(బొమ్మూరు)లోని ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. కార్యాలయంలో 1, 2 ఫ్లోర్లను పరిశీలించి ప్రాజెక్టు అథారిటీ అధికారులు సిబ్బందితో మమేకమవుతారు.