జిల్లాలో సమృద్ధిగా పెట్రోలు, డీజిల్ నిల్వలు
ABN , Publish Date - Apr 27 , 2026 | 12:27 AM
జిల్లాలో పెట్రోలు, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని జేసీ ఎంజె అభిషేకగౌడ స్పష్టం చేశారు.
ఏలూరు సిటీ, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెట్రోలు, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని జేసీ ఎంజె అభిషేకగౌడ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు, వాహనదారులు సాధారణ అవసరాలకు మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని సూచించారు. ఇంధన కొరతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో అధిక కొనుగోళ్లతో శనివారం 28 బంక్లలో కొంత డీజిల్ కొరత ఏర్పడిందన్నారు. ఆదివారం పెట్రోలు కంపెనీల వారితో మాట్లాడి పూర్తిస్థాయిలో డీజిల్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొంత మంది రైతుల పేరుతో క్యాన్లు, డ్రమ్ములతో డీజిల్ కొనుగోలు చేస్తున్నారని, అటువంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు.
నూజివీడు టౌన్: పెట్రోల్ డీజిల్ కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని నూజివీడు సబ్ కలెక్టర్ బి వినూత్న అన్నారు. ఆందోళనతో అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని సూచించారు. నూజివీడు మైలవరం రహదారిపై పెట్రోల్ బంక్, మధుసూదనరావు పెట్రోల్ బంక్, నూజివీడు ఆర్టీసీ పెట్రోల్ బంక్లను ఆమె తనిఖీ చేశారు.