పోటెత్తారు..
ABN , Publish Date - Feb 22 , 2026 | 11:53 PM
కొల్లేటికోట పెద్దింటి అమ్మవారి జాతర మహోత్సవాల్లో ఐదోరోజు ఆదివారం భక్తులతో ఆలయం కిటకిటలాడింది.
పెద్దింటమ్మ దర్శనానికి తరలివచ్చిన భక్తులు
కైకలూరు, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి) : కొల్లేటికోట పెద్దింటి అమ్మవారి జాతర మహోత్సవాల్లో ఐదోరోజు ఆదివారం భక్తులతో ఆలయం కిటకిటలాడింది. సెలవురోజు కావడంతో ఏలూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వేలాదిమంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. భక్తులకు ఉచిత దర్శనం, అంతరాలయ దర్శనాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారి ప్రత్యేక అలంకరణలో భక్తులు దర్శనం ఇచ్చారు. అమ్మవారికి పుష్పాలంకరణ, వస్త్రాలంకరణ, భక్తులకు ఉచిత ప్రసాదాన్ని విజయవాడకు చెందిన కోయ వెంకటేశ్వరరావు, శివపార్వతీ దంపతులు చేయగా ఆలయ అర్చకులు వారిని సత్కరించారు. భక్తుల సౌక ర్యార్థం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడు కొల్లి రాంబాబు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. వాటర్ప్యాకెట్లు, చిన్నపిల్లలకు పాలు విజయవాడకు చెందిన బండారు కృష్ణప్రసాద్, అరుణకుమారి దంపతు లు పంపిణీ చేశారు. రాత్రికి శ్యామల నాట్యమండలి నేషనల్ అవార్డు గ్రహీత కురేళ్ళ లక్ష్మీజ్యోతి శిష్యబృందం చేసిన కూచిపూడి భరతనాట్యం ఆకట్టుకుంది. ఆలయ చైర్మన్ జల్లూరి వెంకన్నబాబు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు.