Share News

ఉడాకు ఓకే..

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:48 AM

జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరింది. కూటమి నేతల ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తణుకు విచ్చేసినప్పుడు జిల్లా కలెక్టర్‌ నాగరాణి ప్రధా నంగా భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేయాలని కోరారు.

ఉడాకు ఓకే..

డెవలప్‌మెంట్‌ అథారిటీ

ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

జిల్లా కేంద్రం పేరుతో ఏర్పాటు

అక్కడే కార్యాలయం

భీమా ఉడా పరిధిలోకి ఆరు మున్సిపాలిటీలు, 19 మండలాలు, 282 గ్రామాలు

నెరవేరిన జిల్లా ప్రజల ఆకాంక్ష

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరింది. కూటమి నేతల ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తణుకు విచ్చేసినప్పుడు జిల్లా కలెక్టర్‌ నాగరాణి ప్రధా నంగా భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అదిప్పుడు నెరవేరింది. జిల్లాల పునర్వవ్యవస్థీకరణ ప్రాతిపదికగా అర్బన్‌ డెవపల్‌మెంట్‌ అథారిటీలను ఏర్పాటు చేయడానికి ఇటీవల మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అందులో భాగంగానే భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (భీమా ఉడా) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. భీమా ఉడా పరిధిలో జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాల కొల్లు, నర్సాపురం మున్సిపాలిటీలు, ఆకివీడు నగర పంచాయతీతో పాటు, 19 మండాలల్లోని 282 గ్రామా లను చేర్చింది. జిల్లా కేంద్రమైన భీమవరంలోనే అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కార్యాలయం ఏర్పాటు కానుంది. జిల్లాలోని వివిధ శాఖల నుంచి సిబ్బందిని భీమా ఉడాలో నియమించాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ముఖ్యంగా సచివాలయాల సిబ్బందిని కూడా భీమా ఉడాలో నియమించే అవకాశం ఉంది. మాస్టర్‌ ప్లాన్‌ ల రూపకల్పన, జోనల్‌ డెవలప్‌ మెంట్‌ ప్లాన్స్‌, భూసేకరణ, పరిష్కారం, లేఅవుట్‌లు, నిర్మాణాల తనిఖీలు, జరిమానా విధింపులు వంటి అధికారాలు భీమా ఉడాకు దఖలు పరిచారు.

సొంత నిధులతోనే నిర్వహణ

భీమా ఉడా నిర్వహణ వ్యయాన్ని సొంత ఆదాయం లోనే వెచ్చించుకోవాలి. ముఖ్యంగా పట్టణాలకు ఆనుకుని ఉన్న పంచాయతీల్లో అపార్ట్‌మెంట్‌లు, బహుల అంత స్తుల నిర్మాణాలు పెద్ద నివాసాల ఏర్పాటుకు భీమా ఉడా నుంచి అనుమతులు మంజూరు కానున్నాయి. పట్టణాల్లోనూ బహుళ అంతస్తుల భవనాల ప్లాన్‌ మంజూరు కూడా దీని పరిధిలోకి వెళ్లనున్నాయి. ఇప్పటి దాకా ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలోనే జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలున్నాయి. ఇటీవలే దాదాపు రూ. 48 కోట్లు మేర జిల్లాలోని మున్సి పాలిటీల్లో అభివృద్ధి పనులకు ఈడా నుంచి నిధులు కేటాయించారు. ఇక నుంచి ప్లాన్‌లు, లేఅవుట్‌ల అను మతుల ద్వారా వచ్చే ఆదాయం భీమా ఉడా ఖాతాలో జమకానున్నాయి. అక్కడ నుంచే నిధులు కేటాయింపులు జరుగుతాయి.

తొలి చైర్మన్‌ ఎవరో..?

భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి చైర్మన్‌ను నియమించనున్నారు. భీమా ఉడా చైర్మన్‌ పదవికోసం జిల్లాలోనూ పోటీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీకే భీమా ఉడా చైర్మన్‌ పదవి దక్కే అవకాశం ఉంది. ఏలూరు డెవలప్‌మెంట్‌ అథారిటీకి జనసేన పార్టీ నుంచి చైర్మన్‌గా నియమించారు. అవే సమీకరణలతో భీమా ఉడాకు తెలు గుదేశం పార్టీనుంచి ఒకరికి చైర్మన్‌ అవకాశం ఇవ్వను న్నారని భావిస్తున్నారు. జనసేనకు కేటాయించినట్టయితే తమకు అవకాశం ఉంటుందంటూ ఆ పార్టీ నుంచి ఆశించే నాయకులు భీమవరంలోనూ ఉన్నారు. జిల్లాలో ఒకరికి కీలకమైన భీమా ఉడా చైర్మన్‌ పదవి వరించ నుంది. చైర్మన్‌ పదవిలో మూడేళ్లపాటు కొనసాగను న్నారు. భీమా ఉడాకు తొలి చైర్మన్‌ పదవి ఎవరికి వరించనుందనే విషయం జిల్లాలో ఆసక్తిగా మారింది. జిల్లా పరిషత్‌ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు కానుంది. ఇలా కీలక పదవులు జిల్లాకు వస్తున్నాయి. అందులో ఏదో ఒకటి తమకు ఇవ్వాలంటూ నాయకులు ప్రయ త్నాలు చేసుకుంటున్నారు. మొత్తంపైన జిల్లాకు ప్రత్యేక ఉడా కల నెరవేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు జిల్లా కలెక్టర్‌ ప్రతిపాదించిన రెండింటిలో ఒకటి అమలులోకి వచ్చింది. జిల్లా కలెక్టరేట్‌ మిగిలి ఉంది. అదికూడా నెరవేరేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Updated Date - Aug 18 , 2026 | 12:48 AM