నూనెలు సలసల
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:14 AM
ఒక పక్క డాలర్తో రూపాయి మారక విలువ పడిపోవడం, వేరుశనగ దిగుబడి తగ్గిపోవడం కారణంగా వంట నూనెల సలసల కాగుతున్నాయి. సంక్రాంతి పండుగ వరకు ధరల బాగానే అదుపు ఉన్నాయి.
15 రోజుల్లో లీటరుకు రూ.15 పెరుగుదల
ప్యాకింగ్ మార్పు.. 910 గ్రాముల నుంచి 750కు తగ్గింపు.. జనం జేబులకు చిల్లు
తాడేపల్లిగూడెం రూరల్, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి):ఒక పక్క డాలర్తో రూపాయి మారక విలువ పడిపోవడం, వేరుశనగ దిగుబడి తగ్గిపోవడం కారణంగా వంట నూనెల సలసల కాగుతున్నాయి. సంక్రాంతి పండుగ వరకు ధరల బాగానే అదుపు ఉన్నాయి. 15 రోజులుగా రెండు, మూడు, ఐదు ఇలా కిలోకు రూ.10 చొప్పున వంటనూనెల ధరలు పెరుగుతున్నా యి. ప్రధానంగా రష్యా, ఉక్రెయిన్ల నుంచి క్రూడాయిల్ సముద్ర మార్గం ద్వారా రవాణా కావాల్సిన ఉన్నప్పటికి.. నిల్వ లకు దొంగల భయం వల్ల సరుకు పెద్దగా దిగుమతి కావడం లేదు. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదల సంతరించుకుందని చెబుతున్నారు. ఏలూరు మార్కెట్లో పండుగ ముందు వరకు సన్ప్లవర్ ఆయిల్ రూ.155కు లీటర్ ప్యాకెట్ అమ్మకాలు సాగగా, అది 165కు చేరింది. వేరుశెనగ నూనెలది అదే దారి. శనగల ధరలు ఇటీవల కేజీ 100 నుంచి 180కు చేరడంతో ఈ రేటుకు ప్యాకెట్కు 20 వరకు పెరిగింది. 170 ఉండే ఈ నూనె ధర రూ.190కు చేరింది. విజయ, ఫ్రీడమ్ బ్రాండ్లు ఎక్కువగా వినియోగంలో ఉంటున్నప్పటికి స్టాకు కొరత కారణంగా కొన్నిచోట్ల రేట్లు పెంచి అమ్ముతున్నారు. తాడేపల్లిగూడెంలో హోల్సేల్ ధరలతో పోల్చినా నూనెల ధరలు పెరిగిపోయాయి. ప్రస్తుతం పామాయిల్ ధర ప్యాకెట్ హోల్ సేల్గా 116 నుంచి 125కు పెరిగాయి. పచ్చళ్ల కోసం వినియోగించే వేరుశనగ ధర రూ.160 నుంచి 180కి ఎగబాకింది. సన్ ఫ్లవర్ 160 నుంచి 175కి విక్రయిస్తున్నారు. పామాయిల్ 115 నుంచి 123 పలుకుతోంది. ఒకప్పుడు అర కిలో, కిలో లీటర్లు ప్యాకెట్లలో విక్రయించే పామాయిల్ ధర రూ.15కు పైగా పెరిగింది. వివిధ కంపెనీలు పోటీ పడి కిలో లీటరు ప్యాకెట్ తయారీని ఎత్తివేశాయి. కంపెనీలు మాయాజాలంతో వారు ఏ ప్యాకెట్ దించితే అదే కొనుగోలు చేయాల్సి వస్తోంది. గతంలో 910 గ్రాములు వుండే ప్యాకెట్లు ఇప్పుడు 750, 800 గ్రాములకు దించాయి. రాబోయేది పచ్చళ్ల సీజన్ కావడంతో నూనెల వినియోగం భారీగా వుంటుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.