టార్గెట్ 100 %
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:54 PM
పదవ తరగతి పరీక్షలకు విద్యాశాఖ సిద్ధం అవుతుంది.
పదో తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళిక
నూరు శాతం ఉత్తీర్ణతకు కసరత్తు
ఈ ఏడాది 22,754 విద్యార్థులు
భీమవరం రూరల్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): పదవ తరగతి పరీక్షలకు విద్యాశాఖ సిద్ధం అవుతుంది. పబ్లిక్ పరీక్షలకు వెళ్ళే విద్యార్థుల సంఖ్యను బట్టి పరీక్ష కేంద్రాల ఏర్పాటుపై ప్రణాళిక చేశారు. దీంతో గత ఏడాది కంటే 2025–26 విద్యా సంవత్సరంలో విద్యార్థులు పెరగడంతో పరీక్ష కేంద్రాలు పెంచేందుకు ప్రతిపాదనలు పంపించారు. 2024–25 పబ్లిక్ పరీక్షలు 21,5 39 మంది రాశారు. ఈ ఏడాది 22,754 మంది పరీక్ష రాయనున్నారు. 1115 మంది విద్యార్థులు పెరగనున్నారు. దానికి తగ్గట్లుగా నాలుగు పరీక్షా కేంద్రాలు పెంచనున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 128 పరీక్షా కేంద్రాల్లో పది పరీక్షలు జరుగుతూ వచ్చాయి. ప్రతిపాదనలు పంపిన నాలుగు కేంద్రాలు అనుమతులు పొందితే 132 పరీక్షాకేంద్రాల్లో టెన్త్ పరీక్షలు జరుగుతాయి. దాంతోపాటు ఒక పరీక్షా కేంద్రానికి బదులుగా వేరే పరీక్ష కేంద్రంలో పరీక్షలు నిర్వహించేలా మార్పునకు అనుమతులు కోరారు. వాటితోపాటు ఇతర పరీక్ష ఏర్పాట్లపై విద్యాశాఖ అడుగులు వేస్తుంది.
వంద రోజుల ప్రణాళికతో పట్టు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా అడుగులు వేస్తున్నారు. వంద రోజుల ప్లానింగ్తో పట్టు బిగిస్తున్నారు. సబ్జెక్టు నిపుణులుతయారు చేసిన ప్రశ్నాపత్రాలను తీసుకుని పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండో శనివారం, ఆదివారం కూడా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. గడిచిన 55 రోజుల్లో వెనుకబడిన విద్యార్థులను ముందుకు వచ్చారు.జిల్లా ప్రభుత్వ పాఠశాలల నుంచి దాదాపు 12,800 విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. వీరందరిని పాస్ చేయించాలనే ఆలోచనతో బోధన సాగుతోంది.
పరీక్షల షెడ్యూల్ ఇలా..
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి మొదలై ఏప్రిల్ 1వ తేదీతో ముగుస్తున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. మార్చి 16వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్–ఏ) ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–118న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీష్, 23న మ్యాథమేటిక్స్, 25న ఫిజికల్ సైన్స్, 28న బయోలాజికల్ సైన్స్ , 30న సోషల్ స్టడీస్, 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2, ఏప్రిల్ 1న ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్స్ (థియరీ) జరుగుతాయి.